నీట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బిగ్ షాక్- మొదటి విచారణకే సీబీఐ లాయర్లు డుమ్మా
నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ కేసుల విచారణలో ఓ ప్రధాన అడ్డంకి ఏర్పడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వివాదాస్పద వ్యవహారంలో త్వరితగతిన తీర్పులు వెలువరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. ఈ కోర్టులో నేడు మొదటిసారిగా జరగాల్సిన విచారణే వాయిదా పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీబీఐ తరఫున ఏ ఒక్క న్యాయవాది కూడా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అను గ్రోవర్ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను చేపట్టారు. పేపర్ల లీక్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన నిందితులు వికాస్ బివాల్, దినేష్ బివాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరపాల్సి ఉంది. నిందితుల తరఫున సీనియర్ లాయర్ ఏపీ సింగ్ కోర్టుకు హాజరయ్యారు గానీ.. సీబీఐ తరఫున మాత్రం ఏ ఒక్కరు కూడా కోర్టుకు రాలేదు. ఆ సమయానికి అక్కడ అందుబాటులో లేరు.

మొదటి రోజు విచారణలోనే ప్రభుత్వ నుంచి గానీ, సీబీఐ నుంచి గానీ ప్రతినిధులు గైర్హాజరు కావడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పిటీషన్ పై తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు. ఈ లోగా కేసును సమర్థవంతంగా వాదించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను తక్షణమే నియమించాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో ప్రభుత్వ పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై విచారణ సాగించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. పరీక్షల లీక్ కు పాల్పడే నిందితులకు పదేళ్ల వరకు కఠిన శిక్ష విధించడంతో పాటు, జరిమానాను కూడా దాదాపు అయిదు రెట్లు పెంచే ప్రతిపాదనలతో కూడిన సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కూడా.












Click it and Unblock the Notifications