కట్నం కేసు: 75 పైసలు జరిమానా విధించి ఈజీగా సెటిల్ చేసిన పంచాయత్
ఫతేహాబాద్: కట్నం కింద కారు ఇవ్వలేమని చెప్పడంతో పెళ్లి ఆగిపోయిన ఘటనలో పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు హర్యానాలోని పంచాయితీ పెద్దలు 75 పైసలు జరిమానా విధించారు. హర్యానాలోని పంచాయితీ వ్వవస్ధల పనితీరుపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన ఫతేహాబాద్లో జరిగింది.
వివరాలిలా ఉన్నాయి. అడిగినంత కట్నకానుకలు ఇవ్వలేదన్న కోపంతో మగపెళ్లివారు మరో 18 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు. దీంతో వధువు తరపు బంధువులు పంతాయితీ పెట్టారు. పెళ్లికి ముందు వరుడికి కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, అందుకు వధువు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
దీంతో పెళ్లి రద్దైంది. రెండు వైపులా వాదనలు విన్న పంచాయితీ పెద్దలు మగ పెళ్లివారిదే తప్పని తేల్చి 75 పైసలు జరిమానా విధించారు. జరిమానాగా విధించిన డబ్బుని అనాజ్ మండిలోని శివాలయ ధర్మశాలకు విరాళంగా ఇవ్వాలని తీర్పునిచ్చారు.
వధువు ఫతేహాబాద్లోని రతినా పట్టణంలో నివసిస్తుండగా, వరుడు సంజీవ్ కుమార్ పంజాబ్లోని మన్సా జిల్లాలోని గెలా గ్రామానికి చెందినవాడు. వీరిద్దరి నిశ్చితార్ధం జనవరి 20, 2014లో అయింది. ఇక వీరి పెళ్లి ఏప్రిల్ 22న జరగాల్సి ఉంది. ఇంతలో వరుడు తరుపు కుటుంబ సభ్యులు కట్నం కింద కారు అడగటంతో ఈ సమస్య వచ్చింది.
దీంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. చివరకు ఈ సెటిల్మెంట్ పంచాయత్ వద్దకు రావడంతో వారు పైవిధంగా తీర్పునిచ్చారు.