నిరుపేద తండ్రీ-కూతురు పెద్ద రైలు ప్రమాదం తప్పించారు: మంత్రి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్, రివార్డులు
అగర్తాలా: ఇటీవల త్రిపురలో కడు పేదరికంలో బతుకుతున్న ఓ తండ్రి, కూతురు కలిసి రైలు ప్రమాదాన్ని నివారించారు. స్వపన్ దెబ్బార్మా (45), అతని కూతురు సోమతిలు 2,000 మందితో వెళ్తున్న రైలుకు ప్రమాదం జరగకుండా అప్రమత్తం చేశారు. త్రిపుర ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుదీప్ రాయ్ బర్మాన్ వారిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, మంత్ర వారికి రివార్డును కూడా రికమెండ్ చేశారు. ఆ మంత్రి ఆ కడు పేదవారిని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టారు.
దీనిపై మంత్రి మాట్లాడుతూ... వారు ధైర్యం చేసి రైలును ఆపకపోయి ఉంటే ఎంతో ప్రాణ నష్టం జరిగి ఉండేదని, ఈ విషయం తనకు తెలియగానే వారిని తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కోసం పిలిచానని, వారితో కలిసి తాను ఫలహారం తిన్నానని ఉద్వేగంగా చెప్పారు.
ఏం జరిగిందంటే?
స్వపన్ దెబ్బార్మా రైల్వే ట్రాకుల పక్కన కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుని బతుకు వెళ్లదీస్తుంటాడు. అతని కూతురు సోమతి. వీరిద్దరిది రోజు అదే పని. రొజులాగానే రైల్వేట్రాకు పక్కన కాగితాలు ఏరుకుంటున్న సమయంలో వీరికి ఒక రైల్వే పట్టా విరిగిపొయి కనిపించింది. త్రిపురలొ కురిసిన భారీ వర్షాలకు అక్కడ భూమి కోసుకుపోయి, అక్కడ పట్టాలు విరిగాయి. అంతలో అటువైపు నుండి 2000 మంది పాసింజర్లతొ రైలు వస్తోంది.
వెంటనే స్వపన్ దెబ్బార్మా, కూతురు సోమతిలు తమ చొక్కాలు విప్పి.. రైలు ఆపమని ఆ చొక్కాలను ఊపుకుంటూ ఎదురు వెళ్లారు. తమ ప్రాణాల గురించి ఆలోచించకుండా రైలును ఆపేందుకు ప్రయత్నించారు. రైలు ఆగింది. ఈ తండ్రీకూతుళ్ల సాహసంతో ఆపిన ఆ రైలులో దాదాపు 2వేల మంది ప్రయాణీకులు ఉన్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి రాయ్ బర్మాన్ వీరిద్దరిని అతని అధికార నివాసానికి పిలిపించి, ఇద్దరికీ మంచి బట్టలు కొని పెట్టారు. మంత్రి రివార్డుకు రికమెండ్ చేశారు. అంతేకాకుండా త్రిపుర అసెంబ్లీ వీరిని అభినందించి, వీరు సౌకర్యంగా బ్రతికేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా రైల్వే శాఖ వీరికి ప్రత్యేక నగధు బహుమతి ప్రకటించనుంది. అసెంబ్లీలో జీరో అవర్లో మంత్రి బర్మాన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రిి బిప్లవ్ కుమార్ దేబ్ వారికి రివార్డు ఇస్తామని చెప్పారు.