భయపడేవారు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు, ఆర్ఎస్ఎస్లో చేరండి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భయపడేవారు కాంగ్రెస్ పార్టీలో అవసరం లేదని, వారంతా ఆర్ఎస్ఎస్లో చేరాలని సూచించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. పిరికివారికి పార్టీలో స్థానం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీంతో శుక్రవారం రాహుల్ గాంధీ సమావేశమై మాట్లాడారు. నిర్భయంగా మాట్లాడే ఎంతో మంది ప్రజలు పార్టీ బయట ఉన్నారని, వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించాలన్నారు.
పార్టీలో కొందరు సభ్యులు భయస్తులున్నారు.. వారిని బయటికి పంపండి. పిరికివారంతా పార్టీని వీడి వెళ్లండి. ఆర్ఎస్ఎస్ వైపు పరుగులు తీయండి. మీలాంటి వారు మాకొద్దు అని రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. జ్యోతిరాదిత్య సింధియా లాంటి వారు భయపడే పార్టీని వీడారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి భయంలేని నాయకులే కావాలని, అదే తమ సిద్ధాంతమని రాహుల్ అన్నారు. పార్టీలో అసమ్మతి నేతలనుద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో భేటీ అయిన కొద్ది రోజులకే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్రంలో నరేంద్ర మోడీని గద్గే దించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను పలుమార్లు కలిశారు. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిశారు. నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రశాంత్ కిశోర్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రయత్నం ఏ మేరకు పలిస్తుందో వేచిచూడాలి.
అయితే, సోనియా గాంధీని కలిసిన నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇప్పటి వరకు అలాంటి ప్రకటనేది రాలేదు. మరోవైపు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలతో ఆమె భేటీ అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications