ఐ ఫోన్ కోసం లేడీ డాక్టర్ను చంపేసిన విద్యార్థి
చెన్నై: ఐ ఫోన్ కోసం మహిళా డాక్టర్ ను దారుణంగా హత్య చేసిన నిందితుడిని చెన్నయ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించిన సమయంలో మహిళా డాక్టర్ ను హత్య చేశానని నిందితుడు విచారణలో అంగీకరించాడాని పోలీసు అధికారులు తెలిపారు.
త్రిపుర రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హరిందమ్ దేబ్ నాథ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పెరంబలూరు జిల్లా తురైమంగళం బాలాజీ నగర్ లో డాక్టర్ శేషు, డాక్టర్ సత్య (32) దంపతులు నివాసం ఉంటున్నారు.
పీజీ (ఎంఎస్) విద్యాభ్యాసం చేసేందుకు సత్య చెన్నయ్ చేరుకుని కల్పాక్కం ప్రభుత్వ కళాశాలలో మూడు నెలల క్రితం చేరారు. వైద్య కళాశాలలో ఎండీ చదువుతున్న సంగీతతో కలిసి సత్య కల్పాక్కం టైలర్స్ రోడ్డులోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది.
ఈనెల 20వ తేదిన ఇంటిలో ఉన్న సత్య హత్యకు గురైయ్యింది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లిన సంగీత సత్య హత్యకు గురైన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్య జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేశారు.
సత్య కుటుంబ సభ్యులతో పాటు పలువురి వేలిముద్రలు సేకరించి విచారణ చేశారు. అయితే హంతకుడు మాత్రం చిక్కలేదు. చివరికి సత్య ఉంటున్న అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న త్రిపురకు చెందిన డాక్టర్, అతని తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్న హరిందమ్ దేబ్ నాథ్ ను పోలీసులు విచారణ చేశారు.
సత్య హత్యకు గురైన ప్రాంతంలో సేకరించిన వేలిముద్రలు, హరిందమ్ దేబ్ నాథ్ వేలిముద్రలు సరిపోవడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ సత్యను హత్య చేసింది తానేనని హరిందమ్ దేబ్ నాథ్ అంగీకరించాడు.
సత్య దగ్గర రూ. 80 వేల విలువైన ఐ ఫోన్ ఉందని దానిని చోరీ చెయ్యడానికి అనేక సార్లు ప్రయత్నించానని అతను పోలీసులకు చెప్పాడు. వీలు కాకపోవడతో ఈ నెల 20వ తేదిన సత్య ఇంటి పని పూర్తి చేసుకుని నిద్రపోయిందని వివరించాడు.
ఆ సమయంలో తాను ఇంటి తలుపు పగలగొట్టుకుని లోపలికి వెళ్లి ఐ ఫోన్ చోరీ చేశానని, అదే సమయంలో సత్య నిద్రలేచి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించిందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని వైర్ తో గొంతు బిగించి తరువాత వంట గదిలో కత్తి తీసుకువచ్చి హత్య చేశానని హరీందమ్ దేబ్ నాథ్ అంగీకరించాడు.