రేప్ జరిగాక చూద్దాం: బాధితురాలితో పోలీసుల నీచపు వ్యాఖ్యలు
లక్నో: ఉన్నావ్, హైదరాబాద్ అత్యాచారం, హత్య ఘటనలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. కొందరు పోలీసులకు మాత్రం తమ బాధ్యత తెలిసి రావడం లేదు. తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో అత్యంత నీచంగా మాట్లాడారు. రేప్ జరిగిన తర్వాత కేసు నమోదు చేస్తామంటూ బదులిచ్చారు. దీంతో ఆ బాధితురాలు హతాశురాలైంది.
సామూహిక అత్యాచార యత్నం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సింధూపూర్ గ్రామానికి చెందిన బాధితురాలు ఘటనకు సంబంధించి తెలిపిన వివరాల ప్రకారం.. స్వగ్రామంలో మందులు తీసుకురావడానికి వెళ్తున్న తనను ఐదుగురు యువకులు అడ్డగించి సామూహిక అత్యాచారానికి యత్నించారు. వారిలో ముగ్గురు బాధితురాలికి తెలిసిన వారే కావడం గమనార్హం.
100కు కాల్ చేస్తే..
వారి నుంచి తప్పించుకుని ఘటనపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు 1090కి కాల్ చేసింది. వారు 100కి ఫోన్ చేయాలని చెప్పడంతో 100కు కూడా కాల్ చేసింది. అయితే, వాళ్లు ఉన్నావ్ పోలీస్ స్టేషన్కు వెళ్లమన్నారు. అక్కడికి వెళితే సంఘటన జరిగిన ప్రదేశం స్థానిక బీహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి.. అక్కడికి వెళ్లమన్నారని బాధితురాలు తెలిపింది.
బాధితురాలికి నిందితుల బెదిరింపులు
మూడు నెలల నుంచి తనను ఇలాగే తిప్పించుకుంటున్నారని బాధితురాలు వాపోయింది. తాను ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి.. ఆ యువకులు రోజూ తమ ఇంటికి వచ్చి కేసు నమోదైతే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది.
అత్యాచారం జరిగాక కేసు నమోదుంటూ..
పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అత్యాచారం జరగలేదు కదా.. జరిగిన తర్వాత కేసు నమోదు చేస్తామంటూ చెబుతున్నారని బాధితురాలు వాపోయింది. ఇలాంటి పోలీసులతో తమకు రక్షణ ఎక్కడ ఉంటుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నేరం జరుగుతుందని తెలిసినా.. పోలీసులు స్పందించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులైనా.. ఆ పోలీసులపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు కోరుతోంది. ఈ విషయంపై ఐజీని మీడియా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ జవాబు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఉన్నావ్లోనే దారుణం జరిగినా..
ఉన్నావ్లో అత్యాచార బాధితురాలు గురువారం కోర్టుకు వస్తున్న సమయంలో ఐదుగురు దుండగులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించారు. కాలిన గాయాలతోనే బాధితురాలు కేకలు వేసుకుంటూ కిలోమీటర్ వరకు పరుగులు పెట్టింది. మొదట ఆమెను లక్నోలోని ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు. ఆమె గురువారం రాత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. చనిపోయే ముందు బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఓ వైపు ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పికీ.. జిల్లాలోని పోలీసులే తాజాగా బాధితురాలితో అలా మాట్లాడటంపై నలుమూలల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.