ధూమ్ సినిమా తరహాలో..!: సొరంగం తవ్వి భారీ దోపిడీ
చండీగఢ్: బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ చిత్రం ధూమ్ స్ఫూర్తితో హర్యానాలో దొంగలు తెగబడ్డారు. 125 ఫీట్ల సొరంగం తవ్వి వారు బ్యాంకును దోచుకున్నారు. హర్యానాలోని గోహనా టౌన్షిప్లో సొరంగం తవ్వి ఓ బ్యాంకు స్టాంగ్ రూంకు చేరుకొని డబ్బులు, కోట్లాది రూపాయల నగలు, బంగారం దోచుకున్నారు.
దోపీడిని సోమవారం ఉదయం గుర్తించారు. సొరంగం తవ్వి, స్ట్రాంగ్ రూంకు వచ్చినందున.. ఈ దోపిడీ శనివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం మధ్యన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సదరు దొంగలు స్ట్రాంగ్ రూంలో ఉన్న 360 లాకర్లలోని 90 లాకర్లను దోచుకెళ్లారని బ్యాంకు మేనేజర్ చెప్పారు.
పోలీసులు బ్యాంకులోని రెండు గదుల్లో సొరంగం తాలుకు మట్టిని గుర్తించారు. దొంగలు లోనికి వచ్చి అన్ని కిటికీలు మూసేశారు. దీంతో వారు బయటకు కనిపించకుండా పోయారు. తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని గొహానా డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు సోమవారం చెప్పారు.
బ్యాంకు లోపల పలు సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, స్ట్రాంక్ రూంలో మాత్రం ఎలాంటి కెమెరాలు లేవు. 2007లోను కేరళలోని మలప్పురంలో ఇలాంటి దోపీడీయే ఓ బ్యాంకులో జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి సొరంగం తవ్విన దొంగలు భారీగా నగదు, బంగారం దొంగిలించుకుపోయారు.
మాసాయిపేట బ్యాంకులో చోరీ
కెనరా బ్యాంకులో భారీ చోరీ జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని బ్యాంకు గోడకు కొంతమంది దొంగలు కన్నం వేశారు. వాళ్లు బ్యాంకులోకి దూరి ముందుగా అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత లాకర్ రూంను కూడా ధ్వంసం చేశారు.
అనంతరం అక్కడున్న నగదును దోచుకెళ్లారు. దాంతో పాటు బ్యాంకులో ఉన్న ఆరు కంప్యూటర్లను కూడా తీసుకు వెళ్లారు. లాకర్ రూం వెనుక వైపు గోడకు వాళ్లు కన్నం వేశారు. ఉదయం బ్యాంకు తెరిచే వరకు విషయాన్ని ఎవరు గుర్తించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.