హీరో సూర్య, జ్యోతిక దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదు; ముదురుతున్న జై భీమ్ వివాదం!!
తమిళ స్టార్ హీరో సూర్య, ఆయన భార్య జ్యోతికలపై అలాగే దర్శకుడు జ్ఞానవేల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జై భీమ్ సినిమా విషయంలో ముదురుతున్న వివాదం కాస్త సూర్య, జ్యోతిక దంపతులపై కేసు నమోదు అయ్యే దాకా వెళ్ళింది.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా మంచి సినిమాగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సూర్య అభిమానులనే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజలను ఎందరినో కదిలించింది. గిరిజనులకు అండగా నిలిచిన లాయర్ చంద్రు కథే జై భీమ్ సినిమా. ఈ సినిమాలో చంద్రు పాత్రలో హీరో సూర్య ఎంతో బాగా నటించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ అందుబాటులో ఉండడం లేదు, దేశంలో ఇంకా సామాజిక అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి అనేది చెప్పడం కోసం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన జై భీమ్ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలను కూడా అందుకుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి సినిమాలో కులాన్ని, మతాన్ని కించపరిచారంటూ రుద్ర వన్నియార్ కుల చత్రియార్ సంఘం అధ్యక్షుడు సంతోష్ నాయక్ సినీ నిర్మాతలతో పాటు హీరో సూర్య, నటి జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వేళచ్చేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ వారిపై కేసు నమోదు చేయాలని మే 5వ తేదీన ఆదేశించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇక ఈ వ్యవహారంలో వన్నియార్ సంఘం హీరో సూర్యపై 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. సినిమాలో వన్నియార్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న సన్నివేశాలపై హీరో సూర్య బేషరతుగా క్షమాపణ కోరితే పరువునష్టం దావాను ఉపసంహరించుకుంటామని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ సూర్య ఈ వ్యవహారంలో ఇప్పటివరకు స్పందించ లేదు. ఇక కోర్టు ఆదేశాలతో తాజాగా సూర్య దంపతులపై, దర్శకుడు జ్ఞానవేల్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.