అత్యంత ఖరీదైన ముకేశ్ అంబానీ నివాసంలో అగ్ని ప్రమాదం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాస భవనంలో సోమవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు హుటాహుటిన చేరుకుని మంటలు ఆర్పేశాయి.

ప్రపంచంలోనే ఖరీదైన భవనాల్లో ఒకటి
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస భవన సముదాయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఆంటీలియా'ఈ ప్రమాదం జరిగింది. ఆరో అంతస్తులో చెలరేగిన మంటల్ని కొద్దిసేపట్లోనే అగ్నిమాపక దళాలు అదుపు చేయగలిగారు.

పెద్ద నష్టమేమీ లేదు..
ఈ ప్రమాదంలో భవంతికి పెద్ద నష్టమేమీ వాటిల్లలేదని మహా ముంబై నగరపాలక సంస్థ విపత్తు నివారణ విభాగం ముఖ్య అధికారి మహేశ్ నర్వేకర్ తెలిపారు.

4జీ ఏంటెనాకు మంటలు
సోమవారం రాత్రి 9.04 గంటలకు సమాచారం రాగా 9.13 గంటలకు భవంతి వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని చెప్పారు. 4జి ఏంటెనాకు మాత్రమే మంటలు పరిమితమయ్యాయని స్పష్టం చేశారు.

తక్కువ స్థాయి ప్రమాదమే..
ఈ ప్రమాదంలో పెద్దగా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని ముంబై ప్రధాన అగ్ని మాపక అధికారి ప్రభాత్ తెలిపారు. అగ్ని ప్రమాద స్థాయి తక్కువ ఉండటం వల్లే పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని తెలిపారు. మూడు ఫైర్ ఇంజిన్లు, రెండు భారీ నిచ్చెనల సాయంతో మంటలు ఆర్పేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications