సికింద్రాబాద్-దానాపూర్ స్పెషల్ ట్రైన్లో మంటలు... రైలు దిగి పరుగులు పెట్టిన ప్రయాణికులు
సికింద్రాబాద్-దానాపూర్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్(02788)లో గురువారం(ఏప్రిల్ 16) మంటలు చెలరేగాయి. ఎస్-2 స్లీపర్ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని చియోకి జంక్షన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే... రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్,సివిల్ పోలీసులు, రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి కొద్ది గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఎస్-2 కోచ్లోని టాయిలెట్ వద్దే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.
బోగిలో మంటలు చెలరేగడంతో చాలామంది ప్రయాణికులు తమ లగేజీని అందులోనే వదిలేసి రైలు దిగి పరుగులు పెట్టారు. దీంతో లగేజీ అందులోనే కాలి బూడిదైపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. మంటలు అదుపులోకి వచ్చేసరికి రాత్రి 7.05గంటలు అయింది.
'ప్రయాగ్రాజ్లోని చియోకి జంక్షన్ ప్లాట్ఫాం నంబర్.2లో ఆగిన దానాపూర్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్లోని ఎస్ -2 కోచ్లో మొదట పొగలు వచ్చాయి. అయితే మంటలు సకాలంలో అదుపుచేయబడ్డాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నాం.' అని నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అజిత్ కుమార్ వెల్లడించారు.