ఢిల్లీ కోర్టు హాల్ లో అగంతకుల కాల్పులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉండే ఓ కోర్టు హాల్ లో అగంతకులు కాల్పులు జరిపారు. ఓ కానిస్టేబుల్ తో సహ ముగ్గురికి తీవ్రగాయాలైనాయి. అప్రమత్తం అయిన భద్రతా బలగాలు ఇద్దరు అగంతకులను అదుపులోకి తీసున్నారు.
బుధవారం ఢిల్లీలోని కర్కర్ డూమా కోర్టు దగ్గరకు ఐదు మంది అగంతకులు వెళ్లారు. తరువాత కోర్టు హాల్ 73 లోకి వెళ్లి ఒక్క సారిగా కాల్పులు జరిపారు. కోర్టు హాల్ లో భద్రతా ఏర్పాట్లలో ఉన్న ఓ కానిస్టేబుల్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్లాయి. మరో ఇద్దరికి గాయాలైనాయి. అక్కడ ఉన్న ప్రజలు పరుగు తీశారు.
వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఇద్దరు అగంతకులను పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురు అగంతకులు అక్కడి నుంచి పరారైనారని పోలీసు అధికారులు చెప్పారు.
తీవ్రగాయాలైన కానిస్టేబుల్ తో సహ ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి వేరే ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలు పట్టుకున్న ఇద్దరు అగంతకులను విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఉగ్రవాదులు దాడులు చేస్తారని ఐబీ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఓ కోర్టులో అగంతకులు కాల్పులు జరపడంతో ఢిల్లీ ప్రజలు హడలి పోతున్నారు.