మండుతోన్న సరిహద్దులు: 45 సంవత్సరాల తరువాత తొలిసారిగా: భారత జవాన్లపై చైనా కాల్పులు
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటిదాకా భారత జవాన్లపై ఘర్షణలకు పాల్పడుతూ వచ్చిన చైనా ఈ సారి మరింత బరితెగించింది. ఏకంగా కాల్పులకు దిగింది. భారత జవాన్లు తమ దేశ భూభాగంపైకి అక్రమంగా ప్రవేశించడాన్ని అడ్డుకోవడంలో భాగంగా వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందనే ఆరోపణలను గుప్పిస్తోంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న ఈ కాల్పులతో వాస్తవాధీనరేఖ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వార్నింగ్ షాట్ ఫైరింగ్..
వాస్తవాధీనరేఖ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ త్సొ సరస్సు సమీపంలోని షెన్పావో పర్వతంపై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని తమ దేశ భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. భారత జవాన్లను నియంత్రించడానికి చైనా బలగాలు వార్నింగ్ షాట్ ఫైరింగ్ నిర్వహించాయని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నట్లు పీఎల్ఏ అధికార ప్రతినిధి, పశ్చిమ సెక్టార్ థియేటర్ కమాండ్ సీనియర్ కల్నల్ ఝాంగ్ షుయిల్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

45 సంవత్సరాల తరువాత..
భారత-చైనా మధ్య సరిహద్దుల్లో కాల్పులు చోటు చేసుకోవడం 45 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 1975లో తొలిసారిగా వాస్తవాధీనరేఖ వెంబడి ఈ రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. 1975 అక్టోబర్ 20వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని తులుంగ్ లా పాస్ సమీపంలో చైనా సైనికులు భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి ప్రయత్నింగా... భారత జవాన్లు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అస్సాం రైఫిల్స్కు చెందిన చైనా బలగాలను అడ్డుకున్నాయి. ఈ కాల్పుల్లో చైనాకు చెందిన నలుగురు సైనికులు మరణించారు.

మళ్లీ తాజాగా..
ఆ తరువాత సరిహద్దుల్లో కాల్పులు జరిపేంతటి ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ ఎప్పుడూ సంభవించలేదు. తరచూ చైనా బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడం.. జవాన్లు వారిని నిలురించడం వంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సిక్కిం సరిహద్దుల్లోని నకు లా పాస్, డోక్లామ్ జంక్షన్ ఇందులో ప్రధాన ఘట్టాలు. డోక్లామ్ జంక్షన్ వివాదం సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ చైనా బలగాలు తరచూ సరిహద్దులను దాటుకోవడానికి ప్రయత్నించాయి. ఈ సారి వారి దృష్టి లఢక్ వైపు పడింది.
భారత్-చైనా మధ్య లఢక్ సరిహద్దుల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ వస్తున్నాయి.
Recommended Video

ఏప్రిల్ నుంచి కొనసాగుతోన్న ఉద్రిక్తత
లఢక్ సమీపంలోని వాస్తవాధీనరేఖ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారు. భారత జవాన్లు వారితో ఘర్షణ పడాల్సి వచ్చింది. ఈ ఏడాది జూన్ 16న చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఆ దేశం దాన్ని ధృవీకరించలేదు. కిందటి నెల 29, 30 తేదీల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సారి కాల్పుల దాకా వెళ్లింది పరిస్థితి.












Click it and Unblock the Notifications