తమిళనాడులో మొదటి కరోనా మృతి కేసు.. 11కి చేరిన సంఖ్య.. మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తోన్న వైరస్
తమిళనాడులో కరోనా వైరస్ సోకిన 54 ఏళ్ల ఓ వ్యక్తి మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(మార్చి 25) తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలో మొదటి కరోనా మృతి కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 11కి చేరింది. తాజా కరోనా మృతి కేసును తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ధ్రువీకరించారు. మృతుడు స్టెరాయిడ్స్ వాడుతున్నట్టుగా తన ట్వీట్లో పేర్కొన్నారు.
తమిళనాడులో మరో ముగ్గురికి పాజిటివ్..
ప్రస్తుతం తమిళనాడులో 11 పాజిటివ్ కేసులు ఉండగా.. మంగళవారం మరో ముగ్గురు పాజిటివ్ పేషెంట్స్ ఆసుపత్రిలో చేరినట్టు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్లో వారికి చికిత్స అందిస్తున్నట్టు విజయభాస్కర్ తెలిపారు. వీరిలో న్యూజిలాండ్ నుంచి వచ్చిన 65 ఏళ్ల వృద్దుడు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 55ఏళ్ల ఓ మహిళ కిల్పక్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతుండగా.. లండన్ నుంచి వచ్చిన మరో 25 ఏళ్ల యువకుడు రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం కరోనా అనుమానిత లక్షణాలతో 50 మంది ఆసుపత్రుల్లో చేరారు.
మహారాష్ట్రలో వేగంగా పెరుగుతోన్న సంఖ్య
మహారాష్ట్రలో నమోదైన తొలి రెండు పాజిటివ్ కేసులు తాజాగా నెగటివ్గా తేలాయి. దీంతో వారిద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మంగళవారం(మార్చి 24)న మరో నాలుగు కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 106కి చేరింది. కొత్త కేసుల్లో మూడు పుణేలో,ఒకటి సతారాలో నమోదయ్యాయి. వీరంతా పెరు,యూఏఈ,సౌదీ నుంచి వచ్చినవారుగా గుర్తించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకి ముగ్గురు మృతి చెందారు. దేశంలో ఎక్కువ పట్టణీకరణ చెందిన రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేవలం 72 గంటల్లోనే కరోనా కేసుల సంఖ్య 64 నుంచి 101కి పెరిగింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించారు.
Recommended Video
దేశవ్యాప్తంగా నమోదైన కేసులు
ఇప్పటివరకు మహారాష్ట్రలో 101,తెలంగాణలో 39,కర్ణాటకలో 37,ఉత్తరప్రదేశ్లో 33,ఢిల్లీలో 31,గుజరాత్లో 29,లడఖ్లో 13,తమిళనాడులో 14,పశ్చిమ బెంగాల్,మధ్యప్రదేశ్,ఆంధ్రప్రదేశ్లలో ఒక్కో పాజిటివ్ కేసు,ఛండీఘర్లో 6,జమ్మూకశ్మీర్లో 4 ,ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్లలో 3,బీహార్,ఒడిశాలో 2,పుదుచ్చేరిలో 1 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. కరోనా వైరస్ను రెండో స్టేజీలోనే కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా మార్చి 24 అర్థరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని చేతులు జోడించి మరీ చెప్పారు.