అందరి చూపు అటు వైపే... క్వాడ్ సదస్సులో తొలిసారిగా దేశాధినేతలు... ఆసక్తిగా గమనిస్తోన్న ప్రపంచ దేశాలు...
క్వాడ్(క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) కూటమి సదస్సులో తొలిసారిగా నాలుగు దేశాల అధినేతలు పాల్గొననున్నారు. శుక్రవారం(మార్చి 12) వర్చువల్గా జరిగే ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,జపాన్ సుగా,ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ పాల్గొననున్నారు. ఇప్పటివరకూ క్వాడ్ సమావేశాలన్నీ విదేశాంగ మంత్రుల స్థాయిలోనే జరగ్గా... తొలిసారి నలుగురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక బైడెన్ పాల్గొంటున్న బహుపాక్షిక సమావేశం కూడా ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో క్వాడ్ కూటమి ప్రపంచానికి ఎటువంటి సందేశాలను పంపించనుందని అన్ని దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఏయే అంశాలపై చర్చించనున్నారు...
పంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు,ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం,నేవిగేషన్ స్వేచ్చ,కోవిడ్ 19,టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు,మెరీటైమ్ సెక్యూరిటీ,పర్యావరణ మార్పులు తదితర అంశాలపై తాజా క్వాడ్ సదస్సులో చర్చించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ సామర్థ్యం పెంపు కోసం క్వాడ్ దేశాల మధ్య ఆర్థిక ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ తయారీ విషయంలో చైనా దౌత్యానికి చెక్ పెట్టేందుకు భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేలా ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం కూడా ఉంది. వ్యాక్సిన్ల తయారీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా భారత్ ఇదివరకే క్వాడ్ సభ్య దేశాలను కోరింది.
మోదీ ఏం మాట్లాడుతారు...
శుక్రవారం జరగబోయే క్వాడ్ సదస్సులో భారత్ను 'ఫార్మసీ ఆఫ్ వరల్డ్'గా ప్రధాని నరేంద్ర మోదీ హైలైట్ చేసే అవకాశం ఉంది. భారత్లో వ్యాక్సిన్ తయారీ,ఇప్పటివరకూ 67 దేశాలతో వ్యాక్సిన్ మైత్రి గురించి ఆయన ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యాక్సిన్ తయారీ విషయంలో క్వాడ్ దేశాల పరస్పర సహాయ,సహకారాల గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అమెరికాలో వ్యాక్సిన్ అభివృద్ది,భారత్లో తయారీ,జపాన్ ఆర్థిక సాయం,ఆస్ట్రేలియా మద్దతు.. ఇలా క్వాడ్ దేశాలు కోవిడ్ 19 విషయంలో అవలంభిస్తున్న విధానాన్ని ఆయన ప్రపంచానికి చాటనున్నారు. మంగళవారం(మార్చి 9) భారత ప్రధాని నరేంద్ర మోదీ,జపాన్ ప్రధాని సుగా ఫోన్లో దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై సంప్రదింపులు జరిపారు.ఇండో పసిఫిక్ రీజియన్లో ఇరు దేశాల మధ్య సహాయ,సహకారాలు,అలాగే క్వాడ్ దేశాల మధ్య సహాయ,సహకారాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు.
ఆసియా నాటోగా క్వాడ్...!!
'క్వాడ్' ఏర్పాటుకు 2004లోనే బీజం పడినప్పటికీ 2007లో అది కార్యరూపం దాల్చింది. మెరీటైమ్ సెక్యూరిటీ, కౌంటర్-టెర్రరిజం,మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించుకోవడం,విపత్తు ఉపశమన చర్యలు వంటి అంశాలపై పరస్పర సహాయ సహకారాల కోసం నాలుగు దేశాలు కలిసి క్వాడ్గా ఏర్పడ్డాయి. 2008లో చైనా ఒత్తిడి కారణంగా ఆస్ట్రేలియా వెనక్కి తగ్గినప్పటికీ మళ్లీ క్వాడ్ కూటమిలో చేరింది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాకు ఈ క్వాడ్ కూటమి మింగుడుపడటం లేదు. ఇండో పసిఫిక్ సముద్ర జలాలపై చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఈ కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఒకరకంగా ఈ కూటమి ఆసియా నాటో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.