చరిత్రలో ఫస్ట్, రోశయ్యకి షాక్: గవర్నర్ లేఖ తిరస్కరణ
చెన్నై: తమిళనాడులోని తంజావూరు, అరవకురిచి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశ ఎన్నికల చరిత్రలో ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తమిళనాడులో మే 16న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే, తంజావూరు, అరవకురిచిల్లో ఓటర్లకు నగదు బట్వాడా జరిగిందన్న ఆరోపణలతో అక్కడ పోలింగ్ను ఈసీ మే 23కి ఆ తర్వాత జూన్ 13 తేదీకి వాయిదా వేసింది.
ప్రస్తుత తరుణంలో ప్రజాస్వామ్య కసరత్తు నిర్వహించడానికి వీల్లేనంత కలుషిత వాతావరణం ఆ నియోజకవర్గాల్లో నెలకొని ఉందని ఈసీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఆ రెండు చోట్లా వెంటనే ఎన్నికలు నిర్వహించకపోతే రాజ్యసభ ఎన్నికల్లో ఓటువేసే అవకాశాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు కోల్పోతారని తమిళనాడు గవర్నర్ రోశయ్య అంతకుముందు ఈసీకి లేఖ రాశారు. ఆయన లేఖలో పేర్కొన్న అంశాన్ని ఈసీ తోసిపుచ్చింది. ఈ రెండింటికి సంబంధం లేదని స్పష్టం చేసింది.
పోలింగ్ కేంద్రాల దురాక్రమణ, కండబలంతో ఓటర్లను బెదిరించి రిగ్గింగుకు పాల్పడటం వంటివి చోటు చేసుకున్నప్పుడు సాధారణంగా ఎన్నికలను రద్దు చేస్తుంటారు. ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టిన కారణం మీద రద్దు చేయడం మాత్రం ఇదే తొలిసారి.
ఇటీవల తమిళనాడులో జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ తదితర ఆరోపణలు రావడంతో తంజావూరు, అరవకురిచ్చి ఎన్నికలను ఈసి వాయిదా వేసింది. మొదట ఈ రెండుస్థానాల ఎన్నికలను మే 23న నిర్వహించాలనుకుంది.
కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జూన్ 13వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు స్థానాలు కీలకం కావడంతో 13వ తేదీ కంటే ముందే ఎన్నికలు నిర్వహించాలని అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు పట్టుబట్టాయి. ఇదే విషయాన్ని ఈసీకి గవర్నర్ ఓ లేఖ ద్వారా తెలిపారు.
స్వేచ్ఛగా, నిజాయితీగా జరగని ఎన్నికల ద్వారా ఎన్నికైన వారు ఆ నియోజకవర్గ ప్రజలకు నిజమైన ప్రతినిధులు కాబోరని ఈసీ వ్యాఖ్యానించింది. రాజ్యసభ ఎన్నికలు జరగాలంటే అన్ని శాసన సభ నియోజకవర్గాలకూ ప్రతినిధులు ఉండాలని చెప్పే చట్టం లేదని పేర్కొంది. ఎన్నికల తేదీపై గవర్నర్ తమకు లేఖ రాయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది.
ఎన్నికల తేదీలను మార్చేముందు ఈసి తనను సంప్రదించి ఉండాల్సిందన్న గవర్నర్ రోశయ్య అభిప్రాయాన్ని తోసిపుచ్చింది. తేదీలపై ఈసీదే తుది నిర్ణయం అని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications