కరోనా: ఐదు రోజులు తిరగని ఆస్పత్రి లేదు... తండ్రి కోసం అంధ యువకుడి ఆరాటం.. ఆ కష్టం అంతా ఇంతా కాదు
కరోనా సెకండ్ వేవ్ వేళ దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. బెడ్ల కొరత,ఆక్సిజన్ కొరత,వైద్యులపై నెలకొన్న తీవ్రమైన ఒత్తిడి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా సోకి ఆస్పత్రికి వెళ్తే అప్పటికప్పుడు బెడ్లు దొరికే పరిస్థితి లేదు. బెంగళూరుకు చెందిన ఓ అంధ యువకుడు కరోనా సోకిన తన తండ్రిని ఐసీయూ వార్డులో చేర్చేందుకు ఐదు రోజులు ఆస్పత్రుల చుట్టూ తిరిగాడంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వారం రోజుల క్రితం తండ్రికి కరోనా...
బెంగళూరుకు చెందిన షమీమ్ అక్తర్(68) అనే ఓ టైలర్కి కొద్ది రోజుల క్రితం కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. గత వారం లక్షణాలు తీవ్రమవడంతో షమీమ్ కుమారుడు షాబాజ్ అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నాడు. పుట్టుకతో అంధుడైన షాబాజ్ తండ్రిని ఆస్పత్రిలో చేర్చేందుకు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు ఐదు రోజులు తండ్రిని తీసుకుని వివిధ ఆస్పత్రుల చుట్టూ తిరగ్గా చివరగా ఆదివారం(మే 10) ఎట్టకేలకు ఓ ఆస్పత్రిలో అతన్ని చేర్చుకున్నారు.

తిరగని ఆస్పత్రి లేదు...
షమీమ్ను షాబాజ్ ఆదివారం(మే 10) మొదట బెంగళూరులోని కోరమంగళ,శివాజీనగర్ ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లాడు. కానీ ఎక్కడా అతన్ని చేర్చుకోలేదు.చివరకు రాత్రి 10గంటల సమయంలో ఇందిరానగర్లోని ఓ ఆస్పత్రిలో చేర్చుకున్నారు. షాబాజ్ మాట్లాడుతూ...'కరోనా లక్షణాలు బయటపడ్డప్పటి నుంచి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నాం. అయితే సోమవారం(మే 3) నుంచి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. నా తల్లి వృద్దురాలు. ఏమీ చేయలేని నిస్సహాయత మాది...' అంటూ షాబాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎక్కడ దొరకని సాయం...
తండ్రి శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతున్నట్లు గుర్తించగానే ఎలాగోలా ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి ఆయన ప్రాణం నిలబెట్టినట్లు షాబాజ్ తెలిపాడు. అలా ఆక్సిజన్ సపోర్ట్తో ఐదు రోజుల పాటు ఆయన్ను తీసుకుని ఆస్పత్రుల చుట్టూ తిరిగానని... ఎక్కడా ఐసీయూ బెడ్ దొరకలేదని వాపోయాడు. అప్పటికీ షమీమ్కి కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ కూడా లేదని... చివరకు ఎలాగోలా సీటీ స్కాన్ తీయించామని చెప్పాడు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించిందని... ఎన్ని స్వచ్చంద సంస్థలను ఆశ్రయించినా ఎక్కడా తమకు ఎలాంటి సాయం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

దేశమంతా ఇదే పరిస్థితి...
ఓవైపు తండ్రి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుంటే... మరోవైపు ఏ ఆస్పత్రికి వెళ్లినా వైద్యం నిరాకరించారని షాబాజ్ వాపోయాడు. ఎట్టకేలకు ఆదివారం రాత్రి ఓ ఆస్పత్రి ఐసీయూలో బెడ్ దొరకడంతో అడ్మిట్ చేసినట్లు చెప్పాడు. తండ్రికి ఆస్పత్రిలో బెడ్ దొరకడంతో ఇప్పుడు తాను కాస్త కుదుటపడ్డాడు. ఇది ఒక్క షాబాజ్ పరిస్థితి మాత్రమే కాదు. దేశంలో ఎంతోమంది కరోనా పేషెంట్ల కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో బెడ్ల కోసం,ఆక్సిజన్ కోసం నరకయాతన పడాల్సి వస్తోంది. గత నెలలో చంద్రపూర్కి చెందిన సాగర్ కిశోర్ అనే వ్యక్తి కోవిడ్ సోకిన తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చేందుకు ఒక్క రాత్రిలోనే 850కి.మీ దూరం ప్రయాణించాడు. ఎక్కడా ఆస్పత్రిలో బెడ్ దొరక్కపోవడంతో... నా తండ్రికి బెడ్ అయినా ఇవ్వండి లేదా చంపేయండి అంటూ ధీనంగా వేడుకున్నాడు. కరోనా వేళ చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు వ్యవస్థలో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి.












Click it and Unblock the Notifications