వాన వణికిస్తోంది: భయం గుప్పిట్లో చెన్నై.. ఇదీ పరిస్థితి!
ఆదివారం నుంచి కురుస్తున్న వర్షం.. మంగళవారం మధ్యాహ్నాం కాస్త తెరిపినిచ్చింది. ఆ తర్వాత మళ్లీ అదే జోరు కొనసాగించింది.
చెన్నై: కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై చివురుటాకులా వణికిపోయింది. ఎటు చూసినా జలమయమే కావడంతో.. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Recommended Video

దాదాపు చెన్నై శివారులోని లోతట్టు ప్రాంతాలన్ని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలు భారీ వర్షాలుగా మారడంతో చెన్నై నగరానికి వరద బెడద తప్పలేదు. ఈ నెల 5వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని వాతావరణ శాఖ చెబుతుండటంతో.. చెన్నై వాసులకు మున్ముందు మరింత గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.

ఐదుగురు మృతి:
భారీ వర్షాల ధాటికి రోడ్ల మీదకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో కాంచీపురం, తిరువళ్లూరు నాగపట్నం, తిరువారూరు, కడలూరు, తంజావూరు, రామనాథపురం, పుదుకోట్టై ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. వర్షాల ప్రభావంతో వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు ఐదుగురు మృత్యువాత పడ్డట్టు సమాచారం. పలు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు.
2015లో సంభవించిన వరదల్లాగే ఈసారి కూడా ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందోనని అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోనే ఈ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు తాగునీటికి ఇబ్బందిపడ్డ చెన్నై జనం.. తాజా వర్షాలతో ఆ బాధ తప్పుతుందని భావిస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం:
భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పెరంబూరు, అంబత్తూరు, మాదవరం రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించారు. కొరట్టూరు, విల్లివాక్కం, అన్నైసత్యానగర్, కీల్పాక్కం ఓట్టేరి లాంటి లోతట్టు ప్రాంతాల ఇళ్లు జలమయం అయ్యాయి.

విద్యుత్ అంతరాయం:
వ్యాసార్పాడి జీవా, కళ్యాణపురం, పెరంబూరు మురసొలిమారన్ సాలై ప్రాంతాల్లోని సొరంగ మార్గాల్లో భారీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాటి గుండా ప్రయాణించడం కష్టంగా మారింది. పలు చోట్ల చెట్లు కూలిపోయి, విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షం.. మంగళవారం మధ్యాహ్నాం కాస్త తెరిపినిచ్చింది. ఆ తర్వాత మళ్లీ అదే జోరు కొనసాగించింది.

పంట నష్టం:
భారీ వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం వాటిల్లింది. కుంభకోణం చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల సంబా పంటలు నీటమునిగినట్టు తెలుస్తోంది. అలాగే తిరువారూరు, నాగపట్నం జిల్లాల్లో సుమారు 10 వేల ఎకరాలలో నష్టం వాటిల్లింది. ఇక తీర ప్రాంతాల్లో జాలర్లు సైతం వేటకు వెళ్లడం లేదు. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో వర్షాలు తగ్గేవరకు వారు వేటకు వెళ్లకపోవచ్చు.

రంగంలోకి చెన్నై కార్పోరేషన్:
భారీ వర్షాలతో చెన్నై వ్యాప్తంగా అలుముకున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై కార్పోరేషన్ ఆధ్వర్యంలో 16 మండలాలకు ఒక్కో ఐఏఎస్ అధికారి చొప్పున నియమించారు. అలాగే విద్యుత్ ప్రమాదాలపై కూడా ముందుగానే అధికారులు అప్రమత్తమయ్యారు. సైదాపేట, కోట్టూరుపురం, జాఫర్ఖాన్పేట మొదలైన ప్రాంతాల్లో ఫైరింజన్ సిబ్బంది సిద్దంగా ఉన్నారు. సహాయక చర్యల కోసం మొత్తం 50వాహనాలను చెన్నై అధికారులు అందుబాటులో ఉంచారు.












Click it and Unblock the Notifications