పన్నీరు సెల్వం వెంట ఆ ఐదుగురు, వారెవరు?
పన్నీరు సెల్వంకు ఐదుగురు నాయకుల మద్దతు లభిస్తోంది. వారు పన్నీరుకు మద్దతుగా, శశికళకు వ్యతిరేకంగా గళం విప్పారు. వారెవరు...
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఏ విధమైన మలుపు తిరుగుతాయనేది తెలియడం లేదు. క్షణ క్షణం రంగు మార్చుకుంటున్నాయి. పన్నీరు సెల్వం తిరుగుబాటు శశికళ ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, ఆమె ఇంకా ఆశతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడం ఇరు వైరి వర్గాలు తలమునకలవుతున్నాయి.
శశికళను చిక్కుల్లో పడేయడానికే అన్నట్లు పన్నీర్ సెల్వం నిర్ణయాలు ప్రకటనలు చేస్తున్నారు. ఆయనకు సన్నిహితులైనవారి తోకలు కత్తిరించే పనిలో శశికళ పడ్డారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఆధిపత్యం సాధించాలనే ప్రయత్నిస్తుంటే అన్నాడియంకె చీఫ్గా ఆమె తన పట్టును కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.
తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శాసనసభలో బలపరీక్షకు సిద్ధమని పన్నీర్ సెల్వం మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు.. అన్నాడీఎంకేలోని మెజార్టీ ఎమ్మెల్యేలు శశికళ వైపే ఉన్నట్లు తెలుస్తోంది.

డీఎంకే అండతోనే పన్నీర్ సెల్వం బలపరీక్షకు సిద్ధమనే వ్యాఖ్యలు చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పన్నీరు సెల్వంకు ఐదుగురు నాయకులు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ ఆయనకు అండదండలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నేత పీహెచ్ పాండియన్, మాజీ విద్యాశాఖ మంత్రి సీ అరంగనాయకమ్, మరో ఇద్దరు మాజీ మంత్రులు ఆర్. విశ్వనాథన్, కేపీ మునుస్వామి, అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ పన్నీర్ సెల్వంకు మద్దతుగా గొంతు విప్పారు.
ఈ ఐదుగురు మాజీల మద్దతు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం పెద్దగా పెన్నీరు సెల్వం వైపు రావడం లేదని అంటున్నారు. అయితే డీఎంకే మద్దతుతో తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి పన్నీర్ సెల్వం విముఖత వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications