దారుణం: వారిద్దరు గొడవపడ్డారు.. మధ్యలో ఆ చిన్నారి ప్రాణం తీశారు..!
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ ఐదునెలల బిడ్డ ప్రాణాలను బలిగొంది. బిడ్డ తల్లి తండ్రి గొడవ పడుతుండగా తల్లిపై తండ్రి కర్రతో దాడి చేసే క్రమంలో అద గురి తప్పి చిన్నారి తలకు తగలడంతో ఆ కర్రకు ఉన్న మేకు బలంగా లోపలికి గుచ్చుకుని చిన్నారి ప్రాణాలు విడిచాడు. అక్కడి నుంచి తండ్రి పరారయ్యాడు.
ఘజియాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు తండ్రి. అయితే ఈ ఉద్యోగం మానేసి గత కొన్ని నెలలుగా ఇంట్లోనే ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ క్లినిక్లో నర్సుగా పనిచేస్తోంది. అయితే ఉద్దేశపూర్వకంగా కాని హత్యకింద కేసును నమోదు చేశారు పోలీసులు. గొడవ పడే సమయానికి చిన్నారి తన తల్లి ఒడిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రోజు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ముందుగా చిన్నారి తల్లిని ఆ తండ్రి దూషించడం మొదలు పెట్టాడని ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై పెద్ద గొడవకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ కర్రతో తల్లిని కొట్టబోయి గురి తప్పడంతో ఆ కర్ర చిన్నారి నుదుటకు తాకి అందులోని మేకు తలలోకి గుచ్చుకుని పోయినట్లు పోలీసులు చెప్పారు. కంగారు పడ్డ తల్లి దండ్రులు చిన్నారిని హాస్పిటల్కు వెంటనే తరలించగా.. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఇక మంగళవారం నుంచి గాయం తిరగబెట్టడంతో మళ్లీ తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతూ మరో పెద్ద హాస్పిటల్కు తరలించారు.
హాస్పిటల్కు తీసుకెళ్లగానే అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బిడ్డ మృతి చెందడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్పిటల్కు చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్కు తరలించారు. గాయం కారణంగా అంతర్గతంగా రక్తమోడి చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. ఇక తప్పించుకున్న తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.