గుజరాత్ కొత్త సీఎం ఎవరు- రేసులో ఉన్నదెవరు : ఆ అయిదుగరు వైపే చూపు- బీజేపీ కీలక ఎత్తుగడలు..!!
గుజరాత్ లో ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమ సొంత రాష్ట్రాంలో వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. మొత్తం 182 మంది సభ్యులు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో తిరిగి అధికారం దక్కించుకొనేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. అందులో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవివి రాజీనామా సమర్పించారు.
గుజరాత్ లో ఆసక్తి కర పరిణామాలు
అనంతరం బీజేపీ గుజరాత్ వ్యవహారాల ఇన్చార్జి భూపేంద్ర యాదవ్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ఆచార్య దేవవ్రత్ను కలిశారు. ఈ రెండు పరిణామాలు చకచకా జరిగిపోయాయి. నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వడం కోసమే తాను సీఎం పదవి నుంచి తప్పుకున్నానని విజయ్ రూపానీ చెబుతున్నా, అసలు కారణం కొత్త సీఎం ఆధ్వర్యంలో ఎన్నికలకు సమాయత్తం కావటమేనని స్పష్టం అవుతోంది. విజయ్ రూపానీ రాజీనామా చేయటంతో ఇప్పుడు కొత్త సీఎం ఎవరనేది ఆసక్తి కర చర్చకు కారణమైంది.
సీఎం పదవి కోసం పోటీలో అయిదుగురు
అందులో పలువురి పేర్లు రేసులో ఉన్నాయి. ముందువరుసగా ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుక్ మాండవీయ, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్, రాష్ట్ర మంత్రి ఆర్సీ ఫాల్దు తో పాటుగా రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ఉన్నారు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి అతని నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నూతన సీఎం రేసులో మొత్తం నలుగురు నేతలు ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతున్నది.
ఆరెస్సెస్-బీజేపీ ప్రముఖుల మంతనాలు
నితిన్ పటేల్ 2016 నుంచి గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు. ఇక సీఆర్ పాటిల్ లోక్సభ్యుడిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన 6,89,668 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. మరో పేరు పురుషోత్తమ్ రూపాలా కూడా మోదీ ప్రభుత్వంలో మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు.పురుషోత్తం రూపాలా తో పాటుగా గోర్డన్ జఢాఫియా పేర్లు ఆర్సెస్ -బీజేపీ సర్కిల్స్ లె ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జడాఫియా గుజరాత్ బీజేపీ ఉపాధ్యక్షుడి గా ఉన్నారు. ఆయన 2002 లో జరిగిన అల్లర్ల సమయంలో హోం శాఖ సహాయ మంత్రిగా పని చేసారు.
బీజేపీ లెక్క పక్కా- పీఠం నిలబెట్టుకోవటమే లక్ష్యం
గాంధీ నగర్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కమలనాధులు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా తో పాటుగా బీజేపీ కార్యనిర్వహఖ కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం గుజరాత్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. మంగళవారం కొత్త సీఎం ఎంపిక ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పటికే పక్కా లెక్కలు- సమీకరణాలతో ఎవరికి సీఎం పీఠం కట్టబెట్టాలనే నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కొత్త సీఎం ఎవరనేది తెలిసే అవకాశం ఉంది.