బీజేపీ పరిస్థితేంటీ?: అంచనాలన్నీ తలకిందులే:ఊరించి..ఉసూరుమనిపించినట్టే
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే నిలిచాయి.
టగ్ ఆఫ్ వార్గా నిలిచిన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టం చేశాయి. ఈ రాష్ట్రంలో పాగా వేయడానికి కమలనాథులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదని పేర్కొన్నాయి. అస్సాంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశాయి. తమిళనాడులో అధికారాన్ని కోల్పోవడం ఖాయమని అంచనా వేశాయి. అధికార ఏఐఏడీఎంకేతో కుదుర్చుకున్న పొత్తు బెడిసికొట్టినట్టేనని తేలింది.
కేరళలో ఉనికిని చాటుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించనట్టేనని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అక్కడ అధికార ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. బీజేపీ ఖాతా తెరవడం కూడా కష్టమేనని పేర్కొన్నాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని తెలిపాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ అధికారాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు లేకపోలేదని అంచనా వేశాయి.