వరదల బీభత్సం: నలుగురు మృతి, బాధితులుగా 11 లక్షల మంది ప్రజలు, ఆగని భారీ వర్షాలు
గౌహతి: అస్సాంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా గత 24 గంటల్లో రాష్ట్రంలో నలుగురు మృతి చెందగా, 11.09 లక్షల మంది ప్రజలు వరద బాధితులుగా మారారు. కోక్రాఝర్, బొంగైగావ్, దర్రాంగ్, ఉదల్గురి, బక్సా, బార్పేట, చిరాంగ్, ధుబూరి, సౌత్ సల్మారా, మోరిగావ్, కరీంగంజ్, కమ్రూప్, గోల్పరా ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంmr మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని గౌహతి ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రమాద స్థాయి బ్రహ్మపుత్ర సహా ఇతర నదులు
శుక్రవారం ఉదయం మానస్, పగ్లాడియా, పుతిమరి, కొపిలి, గౌరంగ్, బ్రహ్మపుత్ర నదులలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి మించి ఉన్నాయి. 19782.80 హెక్టార్లకు పైగా పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులంతా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
అస్సాంలో భారీ వర్ష హెచ్చరికలు, స్కూల్స్ బంద్
అసోం వరదల దృష్ట్యా వివిధ జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కమరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలను మూసివేయవలసిందిగా కోరారు. డిమా హసావో జిల్లాలో, జూన్ 15-18 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు.
భారీ వర్షాలతో రైళ్లు నిలిపివేత
వర్షం, వరదల కారణంగా అస్సాంలో పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. పలు రైళ్లను దారి మళ్లించారు. వరదల్లోనే పలు రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లు ఉండటంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం, కలైగావ్ ప్రాంతంలోని 10 గ్రామాలు వరద నీటిలో మునిగిపోగా, కలైగావ్-ఉదల్గురి రహదారి కొట్టుకుపోయింది. తాముల్పూర్ జిల్లాలో 7 వేల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. మంగళవారం గౌహతిలో కొండచరియలు విరిగిపడి నలుగురు చనిపోయారు.

నేడు కూడా అస్సాంలో భారీ వర్షాలు
మరోవైపు, అస్సాంలోని పలు జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.కేకేరికుచి, ద్వారకూచి, బోడోలాండ్ చౌక్తో సహా పలు గ్రామాలు వరద నీటితో మునిగిపోగా, బొరోలియా, పగ్లాడియా, మోటోంగా నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా వరదల్లోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.












Click it and Unblock the Notifications