మందగమనమే.. ఆర్థిక మాంద్యం లేదు, ఉండబోదు: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మాంద్యం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశంలో ఆర్థిక మందగమనం ఉందే తప్ప ఆర్థిక మాంద్యం పరిస్థితులు లేనేలేవని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు.

లెక్క చెప్పిన ఆర్థిక మంత్రి
ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వానికీ, ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి లెక్కలతో సహా నిర్మలా సీతారామన్ వివరించారు. 2009-14 యూపీఏ-2 హయాంలో 189.5 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అదే బీజేపీ హాయాంలో ఆ సంఖ్య 284.9 బిలియన్ డాలర్లకు పెరిగిందని తెలిపారు. అదే సమయంలో విదేశీ మారక నిల్వలు కూడా 304.2 బిలియన్ డాలర్ల నుంచి 412.6 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

మాంద్యం లేదు.. ఉండబోదు..
దేశంలో ఆర్థిక మందగమనం పరిస్థితులే ఉన్నాయి తప్ప.. ఎలాంటి మాంద్యం లేదని, ఉండబోదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సంక్షోభంలో ఉన్న బ్యాంకింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి వివరించారు. అలాగే 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అందుకునేందుకు 32 చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకునే తమ ప్రతి అడుగు ఉంటుందని చెప్పారు.

కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాల వాకౌట్
అయితే, సీతారామన్ సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ బాటలోనే టీఎంసీ సభ్యులు, వామపక్షాల సభ్యులు కూడా నడిచారు. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మందగమనాన్ని తగ్గించేందుకు పన్నుల సంస్కరణలు కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications