నిత్యావసరాల చట్టంలో కీలక సవరణలు.. ‘ఆపరేషన్ గ్రీన్’పేరుతో కొత్త సప్లై చైన్.. నిర్మలా సీతారామన్ ప్రకటన
లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు దక్కే ప్రయోజనాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఇప్పటికే తొలి విడతలో ఎంఎస్ఎంఈలు, రెండో విడతలో వలస కూలీలు, చిన్న రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపిన ఆమె.. శుక్రవారం మూడో విడత ప్రకటనలో సప్లై చైన్ పైనా కీలక అంశాలను ప్రస్తావించారు..

నిత్యావసరాల చట్టానికి సవరణలు..
లాక్ డౌన్ వల్ల రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ‘‘నిత్యావసరాల చట్టం-1955'కు కీలకమైన సవణలు చేయబోతున్నట్లు మంత్రి నిర్మల చెప్పారు. రైతుల పండించే పప్పు ధాన్యాలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, నూనె గింజల పంటలను నిత్యావసర చట్టం నుంచి బయటకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈరంగంలోకి భారీగా పెట్టుబడులను ప్రోత్సహిస్తామని, తద్వారా వ్యవసాయ రంగంలో పోటీకి ఊతమిచ్చినట్లవుతుందన్నారు.

ఇకపై ఎక్కడైనా అమ్ముకోవచ్చు..
నిత్యావసరాల చట్టం సవరణల్లో భాగంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన ఆంక్షలను తొలగిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. ఈ చర్యతో రైతులు.. ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే తమ పంటలను అమ్ముకునే వీలు ఏర్పడుతుందని, దీని ద్వారా లైసెన్స్ రాజ్ వ్యవస్థకు కూడా అడ్డుకట్ట పడినట్లవుతుందని చెప్పారు. అలాగే, ఈ-ట్రేడింగ్ విధానాన్ని కూడా మరింత బలోపేతం చేస్తామని, ప్రతి సీజన్ లో ఏ మేరకు పంటలు కొనుగోలు చేసే విషయాన్ని కచ్చితంగా వెల్లడించేలా చట్టాలు రూపొందిస్తామన్నారు.

కొత్త సప్లై చైన్ కోసం రూ.500 కోట్లు..
ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్'పులుపునకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ(సప్లై చైన్) ను సరికొత్తగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. లాక్ డౌన్ కారణంగా సప్లై చైన్ బాగా దెబ్బతినిందని అంగీకరించిన ఆమె.. దాని కొత్తగా ఉద్ధరించేందుకు రూ.500 కోట్లు కేటాయించామన్నారు. ‘ఆపరేషన్ గ్రీన్' పేరుతో కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాను చేపడతామన్నారు. అందరికీ మేలు చేకూరేలా ట్రాన్స్ పోర్టు ఖర్చుల్లో 50 శాతం, కోల్డ్ స్టోరేజీ ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తామని నిర్మల తెలిపారు.
Recommended Video

ఔషధ పంటలు.. తేనెటీగల సంరక్షణ..
వ్యవసాయం, అనుబంధ రంగాల పరిరక్షణలో భాగంగా ఔషధ పంటల్ని ప్రోత్సహించేందుకు రూ.4వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు(ఎన్ఎంపీబీ) ఆధ్వర్యంలో ఈ ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడతామని, స్వల్పకాలంలో 2.25 లక్షల హెక్టార్లలో ఔషధ పంటలు పండించేలా, రాబోయే ఐదేళ్లలో వాటి విస్తీర్ణం 10 లక్షల ఎకరాలకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. ఇవికాకుండా, తేనెటీగల సంరక్షణ కోసం మరో రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications