సౌదీ దౌత్యవేత్త ఇంట్లో నేపాల్ మహిళలపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఉన్న విదేశీ దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు మహిళలపై నిరంతరం గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన వెలుగు చూసింది. పోలీసులు, స్వచ్చంద సంస్థ నిర్వహకులు ఇద్దరు మహిళలను రక్షించారు.
విదేశాంగ శాఖ అధికారులతో చర్చించి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్దం అయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇద్దరు నేపాల్ మహిళలు హౌస్ కీపింగ్ పని చెయ్యడానికి ఆరు నెలల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు.
అక్కడ ఒక హౌటల్ లో ఉద్యోగంలో చేరారు. రెండు నెలల పాటు అక్కడే పని చేశారు. తరువాత సదరు కన్సల్టెంట్ ఇద్దరు మహిళలను ఢిల్లీలోని గుర్గావ్ ప్రాంతంలోని సౌదీ దౌత్యవేత్త నివాసంలో పని చెయ్యాలని బదిలి చేశారు. నాలుగు నెలల నుంచి ఇద్దరు సౌదీ దౌత్యవేత్త ఇంట్లో పని చేస్తున్నారు.
ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇద్దరు మహిళలు నిరంతరం అత్యాచారానికి గురౌతున్నారు. చివరికి వారికి తిండిపెట్టకుండ చిత్రహింసలకు గురి చేశారు. బాధను తట్టుకోలేక వారు రెండు మూడు సార్లు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే అది సాధ్యంకాలేదు.
చివరికి చిత్రహింసలు మరి ఎక్కువ అయ్యాయి. అదే ఇంటిలో పని చెయ్యడానికి భారత్ కు చెందిన మహిళ వెళ్లారు. నేపాల్ మహిళల మీద సౌదీ అరేబియా మహిళలు దాడి చెయ్యడం ప్రత్యక్షంగా చూసింది. వారి పరిస్థితి చూసి తనకు అదే గతిపడుతుందని భయంతో అక్కడి నుంచి పారిపోయింది.
ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న మైతేయి ఇండియా అనే స్వచ్చంద సంస్థకు వెళ్లి విషయం చెప్పింది. స్వచ్చంద సంస్థ నిర్వహకులు సౌదీ దౌత్యవేత్త నివాసానికి వెళ్లారు. అక్కడ నేపాల్ మహిళల పరిస్థితి చూసి హడలిపోయారు.
స్వచ్చంద సంస్థ నిర్వహకుల మీద సౌదీ అరేబియా దౌత్యవేత్త ఇంటి సిబ్బంది దౌర్జన్యం చేశారు. చివరికి ఢిల్లీ పోలీసుల సహాయంతో నేపాల్ మహిళలను రక్షించారు. మూడు దేశాలకు సంబంధించిన కేసు కావడంతో విదేశాంగ శాఖ అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.