30ఏళ్ల తర్వాతా నా తండ్రిపై బిజెపి..: రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భోపాల్ గ్యాస్ విషాదంలో నిందితుడైన అండర్సన్ భారత్ నుంచి పరారవడానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తోడ్పడ్డారని బిజెపి ఆరోపించిన నేపథ్యంలో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హయాంలో న్యాయ వ్యవస్థ బాగా పని చేసేదని.. తన తండ్రి ఏ తప్పు చేయలేదని తేల్చిందని చెప్పారు. అయినా, గత 30 ఏళ్ల నుంచి బిజెపి ఈ అంశాన్ని ఎత్తి చూపుతూనే ఉందని.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
ప్రస్తుత బిజెపి హయాంలో నేరస్తులంతా హాయిగా ఉన్నారని మండిపడ్డారు. వ్యాపం కుంభకోణంలోని నిందితులను కూడా బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ఐపిల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని భారత్కు రప్పించే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా? అని ప్రశ్నించారు.
అవినీతి పరులను కాపాడేందుకు కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చ లేక పోయారని విమర్శించారు.
నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని మోడీ మాట తప్పారని పేర్కొన్నారు. మోడీకి సభలో మాట్లాడే దమ్ము లేదని అన్నారు. సభలో మేం 40 మందిమే ఉన్నా ఎన్డీఏను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వివరించారు.