ప్రియాంకగాంధీ నియామకంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే?, స్మృతి ఇరానీ నో కామెంట్
న్యూఢిల్లీ: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పరోక్షంగా స్పందించారు. వారసత్వ రాజకీయాలకు (కాంగ్రెస్), పని చేసే వారి (బీజేపీ)కి మధ్య పోరు జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీ అని విమర్శించారు.
కొందరు తమ కుటుంబాన్నే పార్టీగా భావిస్తారని, బీజేపీ మాత్రం అందుకు భిన్నమని చెప్పారు. బీజేపీ కుటుంబాలకు ప్రాధాన్యతను ఇస్తూ నిర్ణయాలు తీసుకోదని చెప్పారు. పార్టీనే తాము తమ కుటుంబంగా భావిస్తామన్నారు. కొన్ని పార్టీలు ప్రత్యేకంగా ఓ కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ నిర్ణయాలు తీసుకుంటాయన్నారు.
నాలుగు జనరేషన్ల నెహ్రూ - గాంధీ పాలనకు, ఈ నాలుగేళ్ల పాలనకు తేడా చూడాలని మోడీ అన్నారు. నాలుగు జనరేషన్ల పాలనకు, నాలుగేళ్ల చాయ్వాలా పాలనకు మధ్య పోరు అన్నారు. ప్రియాంక గాంధీ నియామకంపై స్మృతి ఇరానీ ఏమీ మాట్లాడలేదు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై ఆమె విమర్శలు చేస్తారు. ఇప్పుడు మాట్లాడేందుకు నిరాకరించారు.
ప్రధాని మోడీ అంటే భయం, సొంత ప్రయోజనాల కోసం ఆరాటం కారణంగానే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. పశ్చిమ్ బెంగాల్లోని ఝాఢ్గ్రామ్ జిల్లాలో బుధవారం బీజేపీ నిర్వహించిన గణతంత్ర బచావో ర్యాలీలో పాల్గొని, మాట్లాడారు. ఇటీవల కోల్కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన ర్యాలీపై ఆమె విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్ విచిత్రమైన పరిస్థితిని చూసిందని, ఒకే రాజకీయ వేదిక పైకి ప్రతిపక్ష పార్టీ నేతలు వచ్చారని, ప్రజా సంక్షేమం గురించి వారు ఏమీ ఆలోచించరని, వారంతా మోడీపై భయం వల్ల, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కలిశారన్నారు. గతంలో వారంతా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి వారంతా కలిశారన్నారు.