ధారావి మోడల్: ముంబైలోనే ఒక్క కేసు కూడా నమోదుకాని ప్రాంతం, సెకండ్ వేవ్లో తొలిసారి
ముంబై: సెకండ్ వేవ్లో అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో ఆ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముంబైతోపాటు మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గింది. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావిలో సోమవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్మం.
ముంబైలోనే చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతుండగా.. ఈ మురికివాడ ధారావిలో గత 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం అందర్నీ ఆలోచనలో పడేసింది. వలస కూలీలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ తక్కువ స్థాయిలోనే కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి.
డబ్ల్యూహెచ్ఓ సూచించిన మార్గదర్శకాలను పాటించి కరోనాను తరిమికొట్టిన'ధారావి మోడల్' ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా నిబంధనలను పాటించడంతోపాటు కరోనా వచ్చినవారు వైద్యుల సూచించిన మేరకు నడుచుకోవడంతో ఇక్కడ మహమ్మారి తగ్గుముఖం పట్టింది.
ఇరుక్కుగా ఉండే నివాసాలు, వీధుల్లో భౌతిక దూరం అసాధ్యమని భావించినా.. ఇక్కడి ప్రజలు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న చిన్నగా ఉండే ఇళ్లు, ఒకే ఇంట్లో పది మంది వరకు సభ్యులు ఉంటారు. అంతేగాక, 80 శాతం ప్రజలు ఇక్కడ కమ్యూనిటీ టాయ్లెట్స్నే ఉపయోగిస్తారు.
ఇక ఈ ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే వలస కూలీలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఎక్కవ మంది బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ అనే పద్ధతి మంచి ఫలితాలను ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు.