బలవంతపు, మోసపూరిత మతమార్పిళ్లు తీవ్రమైన అంశమే: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చోట్ల జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు చాలా తీవ్రమైన అంశమని, వాటిని గురించి నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది. ఇలాంటి పరిస్థితిని అరికట్టకపోతే అత్యంత క్లిష్టమైన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది.
దేశంలో బలవంతపు, మోసపూరిత మత మార్పిళ్లను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
బలవంతపు మతమార్పిళ్లు చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.వీటిని అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించింది. లేదంటే చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. దేశ భద్రత, మత స్వేచ్ఛను ప్రభావితం చేసే సమస్య అని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
అంతేగాక, బలవంతపు, మోసపూరిత మతమార్పిళ్లను అరికట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఆదేశించింది.