బలవంతంగా ఆరుసార్లు అబార్షన్: షయార బానో
న్యూఢిల్లీ: తలాక్ విధానాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ప్రశ్నించి జాతీయ వార్తల్లో నిలిచిన షయార బానో తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. తనకు తన భర్త బలవంతంగా ఆరుసార్లు గర్భస్ర్తావం (అబార్షన్) చేయించారని ఆరోపించారు.
దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. ఉత్తరాఖండ్లోని కషీపూర్కు చెందిన షయారబానోకు ఆమె భర్త రిజ్వాన్ గత ఏడాది అక్టోబర్లో ముస్లిం సంప్రదాయపద్ధతిలో తలాక్ చెప్పారు. దీంతో ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ముస్లిం మహిళల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం నైనిటాల్లో మీడియాతో మాట్లాడారు. తనకు ఎదురవుతున్న కష్టాలన్నింటి నుంచి విముక్తి పొందాలనుకుంటున్నానని చెప్పింది.
ఇప్పటికే ఇద్దరు బిడ్డల తల్లినైన తనకు ఇష్టంలేకపోయినా బలవంతంగా పిల్స్ వేయడం ద్వారా ఆరుసార్లు అబార్షన్ చేయించారని ఫలితంగా తన ఆరోగ్యం చెడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకోసం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపింది.
ఉద్ధంసింగ్ నగర్ జిల్లా కాషిపూర్ చెందిన షయార సోషియాలజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు కూడా ప్రస్తుతం భర్త రిజ్వాన్ దగ్గరే ఉంటున్నారు.