బీబీసీ ఐటీ సర్వేపై బ్రిటన్ మంత్రి ప్రశ్న-విదేశాంగమంత్రి జైశంకర్ దీటైన జవాబు ?
భారత్ లో బీబీసీ కార్యాలయాలపై ఐటీ సర్వేపై ఆగ్రహంగా ఉన్న బ్రిటన్ మంత్రి జేమ్స్ క్లెవర్సీన్ ఇవాళ ఢిల్లీలో భారత విదేశాంగమంత్రి జైశంకర్ ను ఇదే అంశంపై ప్రశ్నించారు.
ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ, అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం బీబీసీ కార్యాలయాలపై పంజా విసిరింది. ఢిల్లీ,ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వే పేరుతో మూడు రోజుల పాటు అధికారులు నానా హంగామా చేశారు. చివరకు బీబీసీ అక్రమాల్ని నిర్ధారించి వాటిపై చర్యలు తీసుకున్నదీ లేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపడంతో బ్రిటన్ కూడా స్పందించి బీబీసీకి అండగా నిలిచింది.
ఇదే అంశం ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న భారత్, బ్రిటన్ విదేశాంగమంత్రుల భేటీలోనూ ప్రస్తావనకు వచ్చింది. భారత్ లోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ సర్వే పేరుతో కేంద్రం వేధింపులకు దిగడాన్ని బ్రిటన్ మంత్రి జేమ్స్ క్లెవర్లీన్ భారత విదేశాంగమంత్రి జైశంకర్ ను ప్రశ్నించారు. అయితే ఆయన కూడా దీనికి దీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. భారత్ లో పనిచేసే విదేశీ సంస్ధలు కూడా ఇక్కడి నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుందని జైశంకర్ తేల్చిచెప్పారు. దీంతో బ్రిటన్ మంత్రి కూడా ఏమీ చెప్పలేకపోయారు.

ఇదే బీబీసీ ఐటీ సర్వేను తప్పుబడుతూ తాజాగా బ్రిటన్ పార్లమెంటులో అధికార, విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. దీన్ని భావప్రకటనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించాయి. బీబీసీకి అండగా నిలుస్తామని, నిధులు కూడా అందిస్తామని, బీబీసీ వరల్డ్ సర్వీస్ చాలా కీలకమైనదని బ్రిటన్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. బీబీసీకి పాత్రికేయ స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కానీ భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. బీబీసీ భారత్ లో చేస్తున్న మీడియా వ్యాపారంలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లభించినట్లు ఐటీ శాఖ చెబుతోంది.












Click it and Unblock the Notifications