విభేదాలొద్దు: సూచనలు విన్న మోడీ, పథకాలపై కేసీఆర్, నిధులపై బాబు
న్యూఢిల్లీ: అందరు కూడా విభేదాలు మరిచి అభివృద్ధి, ఉద్యోగాలు, పెట్టుబడుల పైన దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులకు సూచించారు. నీతి అయోగ్ తొలి సమావేశంలో మోడీ పలు సూచనలు చేశారు. పేదరిక నిర్మూలన అతిపెద్ద సవాలని చెప్పారు. అభివృద్ధి కోసం మన మధ్య ఉన్న అన్ని విభేదాలు మరిచిపోవాలన్నారు.
కేంద్ర, రాష్ట్రాలు ఐక్యతతో ముందుకు వెళ్లాలని మోడీ అన్నారు. మేకిన్ ఇండియా లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి, సేవారంగాల అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలన్నారు. కాగా, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాము చేపట్టిన పథకాలను తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వివరించారు.
భేటీ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విభజన బిల్లులోని హామీలు నెరవేర్చాలని కోరామన్నారు. ఏపీలో 35 శాతం రెవెన్యూలోటు ఉందని తెలిపారు. నీతి అయోగ్కు ప్రభుత్వం తరఫున సూచనలు చేసినట్లు చెప్పారు. కేంద్ర పథకాలు, స్వచ్ఛ భారత్, నైపుణ్యాభివృద్ధిపై ఉపసంఘాలు ప్రకటించారని చెప్పారు.

కాగా, విధానాల రూపకల్పన, సుపరిపాలన అందించడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ముఖ్యమంత్రులు విలువైన సూచనలు ఇచ్చారని చెప్పారు. అభివృద్ధి, పెట్టుబడులకు ఆకర్షణీయ, విలువైన సూచనలు ఇచ్చారన్నారు. సీఎంలు మాట్లాడుతూ.. బడ్జెట్లో రాష్ట్రాలకు కేటాయించిన నిధులు సింగిల్ పేమెంటులో ఇవ్వాలని కోరారు.
ఉపసంఘాలు: జైట్లీ
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నీతి అయోగ్ కింద సీఎంలతో మూడు ఉపసంఘాలు ఏర్పాటు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం తెలిపారు. స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజనలు రాష్ట్రాల సహకారంతోనే విజయవంతమయ్యాయని చెప్పారు.
66 కేంద్ర పథకాలను కొనసాగించాలని సీఎంలు సూచించారని చెప్పారు. ఏ పథకాలకు నిధులు తగ్గించవద్దని కోరారన్నారు. స్వచ్ఛ భారత్, నైపుణ్యాభివృద్ధిపై ఉపసంఘాలు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ప్రధాని మోడీ తీసుకున్నారని తెలిపారు.
2015 బడ్జెట్ పైన నీతి అయోగ్ చర్చించిందన్నారు. అభివృద్ధి, పెట్టుబడులు, సమర్థత ప్రభుత్వ ప్రాథమ్యాలని చెప్పారు. పేదరిక నిర్మూలన, వ్యవసాయంపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ కోరారని జైట్లీ చెప్పారు.
డుమ్మా కొట్టిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా.. మోడీ ఆహ్వానించిన ఈ సమావేశానికి హాజరు కాలేదు. మమతా బెనర్జీ తప్ప మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు.












Click it and Unblock the Notifications