భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరబ్జీ కరోనాతో కన్నుమూత: సీజేఐ సంతాపం
న్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరబ్జీ(91) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సీనియర్ న్యాయవాది, పద్మ విభూషణ్ గ్రహీత సోలీ సోరబ్జీ ఇటీవల కరోనా బారినపడటంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.
1930లో జన్మించిన ఆయన పూర్తి పేరు సోలీ జహంగీర్ సోరబ్జీ. 1971లో ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా, ఆ తర్వాత 1989లో మొదటిసారిగా భారత అటార్నీ జనరల్ అయ్యారు. ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు కొనసాగారు. మానవ హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారు. 1997లో నైజీరియా కోసం యూఎన్ ప్రత్యేక రిపోర్టర్గా నియమించబడ్డారు. అతను 1998 నుంచి ఐక్యరాజ్యసమితి వివక్ష నిరోధకత, మైనారిటీల రక్షణపై ఉప కమిషన్ సభ్యుడిగా ఉన్నారు.

సోరబ్జీ భారత అటార్నీ జనరల్గా రెండుసార్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. అతని మానవత్వం, దయగల విధానం అతని చట్టపరమైన పనిని నిర్వచించింది. ప్రాథమిక హక్కులు, మానవ హక్కులను పరిరక్షించడంలో దాదాపు ఏడు దశాబ్దాలుగా విస్తరించిన అతని పని తీరు అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది.
ప్రజాస్వామ్య స్తంభాలకు బలాన్ని చేకూర్చిన దిగ్గజంగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అంటూ సోరబ్జీ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు సంతాపం తెలియజేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications