హర్యానాలో జరగబోతోంది ఇదే- కాంగ్రెస్ మాజీ సీఎంలు గెహ్లాట్, హుడా జోస్యం..!
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే నెల 5వ తేదీన ఒకే దశలో జరిగే ఎన్నికల్లో అధికార బీజేపీకీ, విపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు సర్వేలు తేల్చాయి. దీంతో ఆ పార్టీ నేతలు కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని ఓడించి కాంగ్రెస్ భారీ మెజార్టీతో అధికారం చేపట్టబోతోందని ఇద్దరు మాజీ సీఎంలు ఇవాళ వెల్లడించారు.
హర్యానాలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలువబోతోందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. హర్యానా ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన.. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, పదేళ్ల బీజేపీ పాలనంతా అక్రమాల మయం అన్నారు. కాంగ్రెస్ హయాంలో మాత్రం పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయని గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు తగ్గట్టే ఫలితాలు ఉంటాయన్నారు.

మరోవైపు హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా కూడా కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తాను హర్యానాలోని ప్రతీ చోటుకు వెళ్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల నుండి తమకు భారీ మద్దతు లభిస్తోందని తెలిపారు. దాన్ని బట్టి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కాంగ్రెస్ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పగలనన్నారు.ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు పూర్తిస్దాయిలో పనిచేస్తున్నట్లు హుడా పేర్కొన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న జరిగే పోలింగ్ తర్వాత 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications