కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ సిద్దూ, బిజెపిలో చేరిన బియాంత్ సింగ్ కుమార్తె
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే ఆయన బిజెపికి రాజీనామా చేశారు. ఆదివారం నాడు ఆయన రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పంజాబ్ :మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపికి రాజీనామా చేసిన సిద్దూ ఆ పార్టీని వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. కొంతకాలంగా ఆయనపై వస్తోన్న ఊహగానాలకు తెరపడింది. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సమక్షంలో సిద్దూ కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకొన్నారు.మరో వైపు మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కుమార్తె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.
పంజాబ్ రాష్ట్రం నుండి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎంపిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అయితే సిద్దూ తన స్థానాన్ని అరుణ్ జైట్లీ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆనాటి నుండి సిద్దూ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.
పంజాబ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి మూడు మాసాల ముందుగా బిజెపికి రాజీనామా చేశారు సిద్దూ. ఆమ్ ఆద్మీ పార్టీలో సిద్దూ చేరుతారనే ప్రచారం తొలుత సాగింది. అయితే ఆయన ఆప్ ను వదులుకొని కాంగ్రెస్ ను ఎంచుకొన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అధికార పార్టీపై కొంత వ్యతిరేకత ఉన్నట్టగా సర్వేలు చెబుతున్నాయి.అయితే సిద్దూ చేరికతో కాంగ్రెస్ పార్టీలాభపడుతోందా అనే విషయమై చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ ను ఎంచుకొన్న సిద్దూ
పంజాబ్ రాష్ట్రంలో అమృత్ సర్ పార్లమెంట్ స్థానం నుండి సిద్దూ బిజెపి తరపున విజయం సాధిస్తూ వచ్చారు. అయితే 2014 ఎన్నికల్లో సిద్దూను కాదని ఈ స్థానం నుండి అరుణ్ జైట్లీని బరిలోకి దింపింది బిజెపి. జైట్లీ కోసం సిద్దూ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో సిద్దూ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో సమయం కోసం వేచిచూశారు. ఎన్నికల వేళ బిజెపికి గుడ్ బై చెప్పికాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నాడు.
ఆప్ ను కాదని కాంగ్రెస్ ను ఎంచుకొన్న సిద్దూ
బిజెపికి రాజీనామా చేసిన సిద్దూ తొలుత ఆప్ లో చేరుతారని ప్రచారం సాగింది. ఆప్ కూడ సిద్దూను ఆహ్వనించింది. అయితే సిద్దూ చేసిన డిమాండ్ల మేరకు టిక్కెట్ల కేటాయింపుపై ఆప్ కూడ సానుకూలంగానే స్పందించింది.అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ తో ఆప్ ను వద్దనుకొన్నాడని సిద్దూ సన్నిహితులు చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఉపముఖ్యమంత్రి పదవిని సిద్దూకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది. దీంతో కాంగ్రెస్ వైపుకు సిద్దూ ఎంచుకొన్నాడని సమాచారం.
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిస సిద్దూ
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సిద్దూ డిమాండ్లపై చర్చించిన మీదట సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన సమ్మతిని తెలిపాడు.. దీంతో ఆదివారం నాడు సిద్దూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
బిజెపిలో చేరిన మాజీ మంత్రి గురుకన్వాల్ కౌర్
పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. సిద్దూ బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరితే, కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ మంత్రి గురుకన్వాల్ కౌర్ బిజెపి తీర్థం పుచ్చుకొన్నారు. పంజాబ్ మాజీ సిఎం బియాంత్ సింగ్ కుమార్తె గురు కన్వాల్. ఆమె అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో కూడ పనిచేశారు. పంజాబ్ రాష్ట్ర అభివృద్ది కోసం తన తండ్రి పాటుపడ్డాడని ఆమె గుర్తుచేసుకొన్నారు. తమ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సానుభూతి చూపడం లేదన్నారు. ప్రధానమంత్రి మోడీ విధానాలు నచ్చాయని ఆమె చెబుతున్నారు.
వలసలను ప్రోత్సహిస్తున్న పార్టీలు
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయా పార్టీలపై అసంతృప్తిగా ఉన్న నాయకులను ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకొంటున్నాయి. తమ పార్టీలో చేర్చుకొనేందుకు అసంతృప్తులకు గాలం వేస్తున్నాయి.ఈ మేరకు రాజకీయపార్టీలు పోటీలు పడుతున్నాయి. ఈ మేరకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.