ఓల్డేజ్ హోమ్లో.. టీఎన్ శేషన్! అసలేం జరిగింది?
చెన్నై: చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన.. ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు గ్రహీత.. కానీ ఇప్పుడు ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. భార్య జయలక్ష్మితో కలిసి చెన్నైలోని గురుకులం ఓల్డేజ్ హోమ్లో కాలం వెళ్లదీస్తున్నారు టీఎన్ శేషన్.
వయసు మీద పడటం.. పిల్లలు కూడా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్లు వృద్ధాశ్రమంలో ఉంటున్నట్లు దైనిక్ జాగరణ్ అనే పత్రిక వెల్లడించింది. నిజానికి శేషన్, జయలక్ష్మి దంపతులకు కేరళలోని పాలక్కడ్లో సొంత ఇల్లు ఉంది.

వృద్ధాశ్రమంలోనే జన్మదిన వేడుకలు...
గతేడాది డిసెంబర్ 15న శేషన్ తన 85వ పుట్టినరోజున వృద్ధాశ్రమంలోనే తోటివారితో సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు తమకు వచ్చే ఆదాయంతో ఆయన అక్కడి వృద్ధులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. వాళ్లకు అయ్యే వైద్య ఖర్చులను కూడా భరిస్తున్నారు.

పుట్టపర్తి సాయిబాబా భక్తుడు...
పుట్టపర్తి సాయిబాబా భక్తుడైన శేషన్.. ఆయన మరణం తర్వాత తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత ఆయనను కేరళలోని తన ఇంటి నుంచి వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు.
అక్కడే మూడున్నరేళ్ల పాటు ఉన్న ఆయన.. తర్వాత సొంతింటికి తిరిగొచ్చారు.

ఇల్లు వదిలి అదే వృద్ధాశ్రమానికి...
అయితే ఈ మధ్యే మళ్లీ ఇల్లు వదిలి భార్యతో కలిసి అదే వృద్ధాశ్రమానికి తిరిగి వెళ్లారు. ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కేబినెట్ సెక్రటరీతోపాటు పలు అత్యున్నత పదవుల్లో శేషన్ సేవలందించారు.

సీఈసీగానే మంచి గుర్తింపు...
అయితే ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఉన్నపుడే ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆయన తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేశాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి శేషన్ చెక్ పెట్టారు.

1996లో ప్రతిష్టాత్మక అవార్డు...
అసలు టీఎన్ శేషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న సమయంలోనే ఆ పదవికి ఉన్న అత్యున్నత అధికారాలు యావత్ దేశ ప్రజలకు తెలిసొచ్చాయి. శేషన్ అందించిన సేవలకుగాను 1996లో ఆయన్ని ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు వరించింది.












Click it and Unblock the Notifications