బిజెపికి ఓటేసి తప్పు చేశాం: చెల్లెలి పెళ్ళి పత్రికతో వెరైటీ నిరసన
భోపాల్: గత ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి తప్పు చేశామంటూ గతంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసిన ఓ వ్యక్తి తన చెల్లెలి పెళ్ళి పత్రికలో రాయించి తన నిరసనను వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లా దియోరీ పట్టణానికి చెందిన అనురాగ్ జైన్ అనే యువకుడిని కేంద్రప్రభుత్వ నిధులతో చేపట్టిన మలేరియా నివారణ పథకం అమలు కోసం రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగిగా నియమించింది.
ఈ పథకం అమలు గడవు పూర్తికావడంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు గత ఏడాది జూన్ నెలలో కాంట్రాక్టు ఉద్యోగిగా ఉన్న అనురాగ్ జైన్ ను తొలగించింది. ఈ పథకం కింద అనురాగ్ జైన్ తో పాటు 773 మందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా 2010లో నియమించిన రాష్ట్ర సర్కారు 2017లో తొలగించింది.
ఇతర రాష్ట్రాల్లో మలేరియా నివారణ పథకం కింద నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయగా మధ్యప్రదేశ్ లో మాత్రం దానికి భిన్నంగా తొలగించింది. తాము ముఖ్యమంత్రి, రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి విన్నవించినా ప్రయోజనం లేదు.
దీంతో ఉద్యోగాలు కోల్పోయిన మాజీ కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ రకాలుగా బీజేపీ సర్కారుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చివరికి అనురాగ్ జైన్ తన చెల్లెలి వివాహ ఆహ్వాన పత్రికపై గత ఎన్నికల్లో బీజేపీ కమలం గుర్తుకు ఓటేయడం మేం చేసిన పెద్ద తప్పు అని రాసి వినూత్నంగా నిరసన తెలిపారు. శుభలేఖలపై కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టడం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.