మూడు దశాబ్దాల తరువాత రాష్ట్రం మారిన మాజీ ప్రధాని: మరోసారి రాజ్యసభకు నామినేషన్!
జైపూర్: మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరోసారి పెద్దల సభకు ఎన్నిక కానున్నారు. దీనికోసం ఆయన మంగళవారం ఉదయం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సారి ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిల్చున్నారు. 30 సంవత్సరాల తరువాత మన్మోహన్ సింగ్ బయటి రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈశాన్య రాష్ట్రం అస్సాం నుంచి వరుసగా రాజ్యసభకు ఎంపిక అవుతూ వస్తున్నారు.
ఈ సారి అస్సాంలో రాజ్యసభ సీటును గెలిచే పరిస్థితులు లేవు. అందుకే ఆయన రాజస్థాన్ నుంచి బరిలో దిగారు. రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్ ఎన్నిక కావడం సులువే. ఇక్కడ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి ఉంది.

ఈ ఉదయం న్యూఢిల్లీ నుంచి విమానంలో జైపూర్ కు చేరుకున్న మన్మోహన్ సింగ్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం వారు జైపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి.. నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఆ సమయంలో మన్మోహన్ సింగ్ వెంట అశోక్ గెహ్లాట్ తో పాటు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఉన్నారు. రాజస్థాన్ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ షైనీ మరణంతో ఈ స్థానానికి ఎన్నికలు అవసరం అయ్యాయి. చాలినంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడం వల్ల బీజేపీ ఈ స్థానాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ గెలిస్తే.. 2024 ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారు.












Click it and Unblock the Notifications