పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీ- రేపు ప్రకటన-బీజేపీతో పొత్తు
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ రేపు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. పీసీసీ ఛీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూతో నెలకొన్న విభేధాల నేపథ్యంలో సీఎం పదవి కోల్పోయిన అమరీందర్ అప్పటి నుంచి సిద్ధూతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపైనా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన బీజేపీవైపు అడుగులు వేస్తారని తొలుత భావించినా.. అలా చేయకుండా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ లో సిద్ధూతో నెలకొన్న పోరుతో కొంతకాలంగా సతమతం అవుతున్న అమరీందర్ సింగ్.. ఈ క్రమంలో సీఎం పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తనకు ఈ పరిస్ధితి రావడానికి కారులైన సిద్ధూతో పాటు కాంగ్రెస్ పార్టీని సైతం దెబ్బతీసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తొలుత బీజేపీలో చేరతారని భావించినా అధి సాధ్యపడలేదు. దీంతో సొంతంగా పార్టీని స్ధాపించి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

త్వరలో సొంత పార్టీని స్ధాపించి బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకోనున్నట్లు గతవారమే అమరీందర్ సింగ్ సంకేతాలు ఇచ్చారు. వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ పొత్తులు ఉంటాయని కూడా తెలిపారు. దీంతో అమరీందర్ అడుగులపై ఆసక్తి నెలకొంది. త్వరలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమరీందర్ పెట్టే ప్రాంతీయ పార్టీ కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విపక్షంలో ఉన్న అకాలీ గ్రూపుల్ని కూడా కలుపుకుని అమరీందర్ పార్టీ పెట్టే అవకాశముంది.
నా రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ప్రజల్ని సురక్షితంగా మార్చే వరకూ విశ్రమించేది లేదని రెండుసార్లు పంజాబ్ సీఎంగా పనిచేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్తున్నారు. అమరీందర్ అడుగులపై స్పందించిన పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జీందర్ సింగ్ రణ్ధావా ఆయన పెద్ద తప్పుచేస్తున్నారని అన్నారు. అలాగే పాకిస్తానీ జర్నలిస్ట్ అరూసా ఆలమ్ తో అమరీందర్ స్నేహాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఆలంతో అమరీందర్ కు ఉన్న లింకుల దృష్ట్యా ఐఎస్ఐతో కూడా లింకులు ఉన్నాయేమో అన్న అంశంపై దర్యాప్తు చేయిస్తామన్నారు.












Click it and Unblock the Notifications