జయలలిత ఆసుపత్రి బిల్లు రూ. 90 కోట్లు కాదు, ఎవరు చెప్పారు ?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందిన 75 రోజులకు రూ. 6 కోట్లు ఖర్చు అయ్యిందని, అందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం రూ. 90 కోట్లు డిమాండ్ చేసిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం .
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చేసిన చికిత్సకు చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటి వరకు బిల్లు చెల్లించాలని అడగలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.
తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 22వ తేది రాత్రి జయలలిత చెన్నైలోని గ్రీన్స్ రోడ్డ్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. లండన్, సింగపూర్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అమ్మకు చికిత్స చేశారు. 75 రోజుల పాటు జయలలిత ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడారు.
అయితే గుండెపోటు రావడంతో గత సోమవారం జయలలిత మరణించారని అపోలో ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. జయలలిత చికిత్స పొందిన 75 రోజులకు రూ. ఆరు కోట్లు ఖర్చు అయ్యిందని, అందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం రూ. 90 కోట్లు డిమాండ్ చేసిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.
ఆరోగ్య పథకాలకు సంబంధించిన నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయించాలని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిందని, అందులో ఎంత మాత్రం నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పుకార్లను అధికారులు ఖండించారు. జయలలిత చికిత్సకు రూ. 90 కోట్లు ఖర్చు కాలేదని, అయితే కొన్ని కోట్ల రుపాయల ఖర్చు అయిన మాట వాస్తవమే అని అధికారులు, వైద్యులు అంటున్నారు.
చికిత్స బిల్లులు ఇవ్వాలని ఆసుపత్రి వర్గాలు ఇప్పటి వరకు కోరలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే లండన్, సింగపూర్, ఎయిమ్స్ వైద్యులకు ఎంత మొత్తంలో బిల్లులు చెల్లించారు అనే విషయం అధికారులు స్పష్టంగా చెప్పలేదు.