మాజీ కేంద్రమంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ కన్నుమూత.. గాంధీ కుటుంబానికి నమ్మినబంటు
మాజీ కేంద్రమంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ (73) మృతిచెందారు. గాంధీ కుటుంబానికి సతీశ్ వీరవిధేయుడు.. మూడుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలి, అమేథీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన గత కొంతకాలం నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అతనికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో శర్మకు సాన్నిహిత్యం ఉండేది. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో పెట్రోలియం, సహాజ వాయువుల ఉత్పత్తి మంత్రిత్వ శాఖను చేపట్టారు. శర్మ ఉమ్మడి ఏపీ 1947 అక్టోబర్ 11వ తేదీన సికింద్రాబాద్లో జన్మించారు. కమర్షియల్ పైలట్గా ప్రొఫెషనల్ లైఫ్ ప్రారంభించారు. అప్పుడే రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజీవ్ హత్య తర్వాత 1991లో అమేథీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998, 2004లో అమేథీ నుంచి పోటీ చేసి.. గెిచారు. 2004 నుంచి 2016 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహించారు.
శర్మ మృతిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. శర్మ మృతిపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సంతాపం తెలిపారు.