కొత్త పార్టీ: కాంగ్రెస్ పార్టీకి జికె వాసన్ రాజీనామా
చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి జికె వాసన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1996లో తన తండ్రి జికె ముపనర్ స్థాపించిన తమిళ్ మనీల కాంగ్రెస్(టిఎంసి)ని పునర్ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. తాను కొత్త రాజకీయ మార్గంలో వెళ్లాలనుకుంటున్నట్లు ఆయన సోమవారం చెన్నైలో మీడియాకు తెలిపారు.
కాంగ్రెస్ అధిష్టానం తమిళనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఈవికెఎస్ ఎలంగోవన్ను నియమించడం, మరో వైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన బిఎస్ జ్ఞానదేసికన్ రాజీనామాకు అమోద ముద్రవేయడంతో జికె వాసన్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. జ్ఞానదేసికన్కు మద్దతు తెలుపుతున్నట్లు శుక్రవారమే ఆయన తెలిపారు.

వలమన తమిలగం, వలిమయన భారతమ్(సుసంపన్న తమిళనాడు, శక్తివంతమైన భారత్) అనే నినాదాలను తన తండ్రి టిఎంసి ఆవిర్భావం సందర్భంగా చేశారని అన్నారు. కాగా, 2002లో టిఎంసి కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. కామరాజు, ముపనర్ల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉందని చెప్పారు. అలాంటి వ్యక్తుల చిత్రాలను సభ్యత్వ నమోదు కార్డులపై పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించకపోవడం సరికాదని అన్నారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వచ్చిన విభేదాల కారణంగానే పార్టీ వీడుతున్నట్లు వాసన్, జ్ఞానదేసికన్ తెలిపారు. పార్టీకి సేవ చేసిన ముఖ్య నేతలను మర్చిపోవడం మంచిది కాదని పార్టీకి చెప్పా, అధిష్టానం వినలేదని వాసన్ తెలిపారు. కామరాజు, ముపనర్ల చిత్రాలను సభ్యత్వ నమోదు కార్డులపై పెట్టకపోవడాన్ని రాష్ట్ర పార్టీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకోవడం లేదని వాసన్ ఆరోపించారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నాయకత్వం అభిప్రాయం తీసుకోకుండానే ఎన్నికలను వెళ్లిందని, ఆ ఫలితం ఎన్నికల్లో స్పష్టంగా కనిపిపించిందని చెప్పారు. విభేదాల కారణంగానే పార్టీ వీడుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications