ఎస్ఐని నీళ్లలో ముంచి చంపేయబోయారు (వీడియో)
ముంబై: మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్బంగా నలుగురు యువకులు ఓ ఎస్ఐని నీళ్లలో ముంచి చంపేయబోయారు. అయితే ఆయన చాకచక్యంగా వారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
తీస్ గావ్ చెరువులో నిమజ్జనం కార్యక్రమాన్ని కొంత మంది అడ్డుకుంటున్నారని మంగళవారం రాత్రి 9.30 గంటలకు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. వినాయక నిమజ్జనం సక్రమంగా జరిగేలా చూడటానికి ఎస్ఐ నితిన్ ధాగ్లే (38) అక్కడికి చేరుకున్నారు.
అక్కడ ఉన్న ఓ బృందం బారికేడ్ పెట్టి వినాయుడి విగ్రహం అడ్డుగా పెట్టి నిమజ్జనం జరకుండా చేశారని గుర్తించారు. జరిమరి గణేశ్ ఉత్సవ్ మండల్ కు చెందిన సభ్యులు పసుపు పచ్చ రంగు టీషర్టులు వేసుకుని అడ్డుకుంటున్నారని ఎస్ఐ నితిన్ ధాగ్లే గుర్తించారు.
తరువాత వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో నలుగురు యువకులు ఎస్ఐ నితిన్ ను చెరువులోకి నెట్టేశారు. ఓ యువకుడు ఎస్ఐ నితిన్ ను నీళ్లలో ముంచి దాడి చేస్తూ చంపేయడానికి ప్రయత్నించాడు.
చివరికి ప్రాణాలతో బయటపడిన ఎస్ఐ నితిన్ బయటకు వచ్చాడు. ఆ సందర్బంలో మిగిలిన ముగ్గురు ఆయన మీద దాడి చేశారు. ఎవరో ఈ దృశ్యాలను మొబైల్ లో వీడియో తీసి పోలీసు అధికారులకు ఇచ్చారు. ఎస్ఐ నితిన్ ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు.