'అమ్ము' నుంచి 'అమ్మ' గా: జయలలితపై పుస్తకం 7న విడుదల
చెన్నై: భారతదేశ రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. ఆ పురుషాధిక్యతను ఎదుర్కొని కొందరు మహిళలు ప్రాతినిధ్యం వహించారు. అలా భారత రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు నలుగురు మహిళల పేర్లును ప్రస్తావిస్తుంటారు.
అందులో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాందీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి. ఈ నలుగురూ అప్పటి వరకు ఉన్న సంప్రదాయాలను బద్దలు కొట్టి దేశ రాజకీయాల్లో తమదైన ముద్రను వేశారు.
వీరిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్థానం చిత్రమైనది. సంప్రదాయాలకు నిలయమైన తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన కోమలవల్లి, చిన్నతనంలో అందరితో 'అమ్మూ' అని ముద్దుగా పిలిపించుకునేది. అంతేకాదు చిన్నవయసులోనే సినీ రంగంలో అద్భుతమైన పాత్ర పోషించి అందరి మన్ననలను పొందింది.
ఆ తర్వాతి కాలంలో తన కంటే వయసులో 30 ఏళ్ల పెద్దవాడైన ఎంజీఆర్ తో అనుబంధాన్ని ఏర్పర్చుకుంది. ఎంజీఆర్ మరణానంతరం ఆయన ఆశయ సాధనకు ప్రత్యేక పార్టీని స్థాపించి, ఒంటి చేత్తో పార్టీని నడిపింది. పార్టీ నడిపే క్రమంలో మదపుటేనుగుల్లాంటి మగాళ్లతో తలపడింది.
ఈ క్రమంలో ఆమె ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ప్రజల మన్ననలను అందుకుని ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. మీసం మెలేసే మగాళ్లంతా ఆమె ముందు సాగిలపడి సాష్టాంగ నమస్కారం పెట్టే స్థాయిని సంపాదించుకున్నారు. 68 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో పని చేస్తూ ప్రజల అభిమానం చూరగొంటున్నారు.
సంప్రదాయాలకు ఆలవాలమైన తమిళనాడులో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన రెండో నేతగా, తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. చిన్నారి అమ్ము నుంచి అమ్మగా మారిన క్రమంపై ప్రముఖ జర్నలిస్టు వాసంతి రచించిన పుస్తకం అమ్మ (జయలలిత: ఏ జర్నీ ఫ్రం మూవీ స్టార్ టు పొలిటికల్ క్వీన్) సెప్టెంబర్ 7న విడుదల కానుంది. 200 పేజీల ఈ పుస్తకం ధర 299 రూపాయలుగా నిర్ణయించారు.