విలాసాలకు కేరాఫ్ ‘మోసకారి’ మాల్యా: ఎప్పుడేం జరిగిందంటే..?
న్యూఢిల్లీ/లండన్: దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఓ వెలుగు వెలిగిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. ఇప్పుడు ఊచలు లెక్కపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. సినీ ప్రముఖులు, బాలీవుడ్ నాయికలతో విందులు, వినోదాల్లో తేలిపోయిన మాల్యా.. తన కంపెనీలను నిర్లక్ష్యం చేయడంతో నష్టాలపాలు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో బ్యాంకుల వద్ద చేసిన రుణాలు తడిసిమోపెడు కావడంతో దిక్కుతోచని పరిస్థితిల్లో పడ్డాడు. ఈ క్రమంలోనే 'మోసకారి(డిఫాల్టర్)'గా ముద్ర వేయించుకుని దేశం నుంచి పారిపోయాడు.
విజయ్ మిట్టల్ మాల్యా
విజయ్ మాల్యా ప్రస్థానాన్ని గమనించినట్లయితే.. మాల్యా పూర్తి పేరు విజయ్ విట్టల్ మాల్యా. వ్యాపారవేత్త అయిన విట్టల్ మాల్యా కుమారుడే ఈ విజయ్ మాల్యా. యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్. యూపీ గ్రూప్ ఛైర్మన్. అల్కాహాల్, విమానయాన రంగాల్లో ఈ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రియల్ ఎస్టేట్, ఫెర్టిలైజర్స్, తదితర పరిశ్రమలను కూడా ఉన్నాయి. సనోఫి ఇండియా ఛైర్మన్గా కూడా పని చేశారు.
విలాసమే జీవితం
తన విలాసవంతమైన జీవితంతో ఒకనొక దశలో ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్'గా పేరొందాడు మాల్యా. అయితే, 2012 నుంచి అతని కంపెనీలు అవినీతి ఆరోపణలు, కుంభకోణాలతో నష్టాల భారిన పడ్డాయి. దీంతో మాల్యాకు కష్టాలు మొదలయ్యాయి. ఈక్రమంలోనే మార్చి 2, 2016లో విజయ్ మాల్యా మన దేశాన్ని వదిలి లండన్ పారిపోయాడు. తన పిల్లల స్నేహితుల వద్ద ఉంటున్నాడు.
మోసాలు, మనీలాండరింగ్
మొత్తం 17గ్రూప్ బ్యాంకులకు విజమ్ మాల్యా రూ. 9వేల కోట్లకు పైగా రుణాలను ఎగవేశాడు. ప్రపంచంలోని పలు కంపెనీల్లో తనకు 100శాతం లేదా 40శాతం కంటే ఎక్కువగా వాటా ఉందని పేర్కొన్నాడు కూడా. దీంతో రంగంలోకి దిగిన ఆదాయపు పన్ను శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు నిజాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డాయి. ఆర్థిక మోసాలు, మనీలాండరింగ్కు పాల్పడ్డారని తేల్చిన ఈ దర్యాప్తు సంస్థలు.. మాల్యాపై మోసానికి పాల్పడ్డారనే అభియోగాలను మోపింది.
ఆస్తుల కంటే అప్పులు భారీగా
మాల్యా తనకు ఉన్న ఆస్తుల కంటే భారీ మొత్తంలో ఎక్కువగా రుణాలు తీసుకున్నారని అటార్నీ జనరల్ చెప్పడం గమనార్హం. మార్చి 2016లో 17 బ్యాంక్ గ్రూపులు కూడా మాల్యా రుణాలు చెల్లించడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దేశం విడిచి వెళ్లిపోకుండా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించాయి. అయితే, అప్పటికే మాల్యా దేశం విడిచి వెళ్లిపోయాడని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పాస్ పోర్ట్ రద్దు..
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మాల్యాపై మనీలాండర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. తన విమానయాన సంస్థ రూ.900 కోట్లను అక్రమంగా విదేశాలకు పంపించాడనే అభియోగాలను మాల్యాపై మోపింది. కాగా, ఏప్రిల్ 24, 2016లో భారత విదేశీ వ్యవహారాల శాఖ.. మాల్యా పాస్ పోర్టును రద్దు చేసింది. రాజ్యసభ ఎథిక్స్ కమిటీ మాల్యాను బహిష్కరించిన నేపథ్యంలో మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఎంటర్ పోల్తో ఈడీ సంప్రదింపులు
ప్రస్తుతం ఈడీ అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఇంటర్ పోల్ను కోరింది. కాగా, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు ఇచ్చిన రూ. 50లక్షల చెల్లకపోవడంతో.. మార్చి 13, 2016లో హైదరాబాద్ హైకోర్టు.. మాల్యాకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఐపీఎల్లో ఎంజాయ్
ఫార్ములా వన్ టీమ్ సహారా ఫోర్స్ ఇండియాలో కూడా మాల్యా సహ యజమానిగా ఉన్నారు. అంతేగాక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు కూడా మాల్యా యజమానిగా వ్యవహరించారు. 2008లో ఐపీఎల్ సమయంలో మాల్యా చాలానే ఎంజాయ్ చేశాడు. అంతేగాక, వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ రిప్రసెంటింగ్ ఇండియా ఎఫ్ఐఏలో కూడా మాల్యా సభ్యుడు.
మూతపడ్డ కింగ్ ఫిషర్
కింగ్ ఫిషర్ ఎయిల్లైన్స్ను 2005లో ఘనంగా ప్రారంభించి.. దివాలా తీయడంతో 2012 మూసివేశారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన మాల్యా.. బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగనామం పెట్టి మార్చి 2016లో లండన్ పారిపోయాడు. అతడ్ని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేసింది.
వేచిచూడాల్సిందే..
తాజాగా, మంగళవారం మాల్యాను లండన్ లో స్కాట్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేసి.. వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరు పర్చగా.. కోర్టు అతడికి బెయిలు మంజూరు చేసింది. ఈ క్రమంలో మాల్యాను భారత్ రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థలు ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో కొంత కాలం వేచిచూడక తప్పదు.