50 ఏళ్ల తర్వాత దేశంలో కమ్యూనిస్ట్ సీఎం లేని పరిస్థితి.. లెఫ్ట్ పతనం?
శతాబ్ద కాలం పాటు అణగారిన వర్గాల గొంతుకగా, ఎర్రజెండా నీడన విప్లవ భావజాలాన్ని రగిలించిన భారత వామపక్షం నేడు తన ఉనికి కోసమే పోరాడాల్సిన దుస్థితికి చేరుకుంది. ఒకప్పుడు భారత రాజకీయ యవనికపై కింగ్ మేకర్గా వెలుగొందిన 'లెఫ్ట్' కోటలు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి. మే 4, 2026.. భారత కమ్యూనిస్టుల చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోనుంది.
భారత రాజకీయాల్లో వామపక్షాల ప్రస్థానం ఒక అద్భుతం. 2004 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 59 సీట్లు గెలుచుకుని, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కమ్యూనిస్టులు పోషించిన పాత్ర అసాధారణం. అప్పట్లో ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి వంటి నాయకులు ఢిల్లీ పీఠాన్ని శాసించేవారు. పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల తిరుగులేని పాలన, కేరళలో ప్రత్యామ్నాయ అధికార మార్పిడి, త్రిపురలో ఇనుప కోట వంటి విజయాలతో 'ఎర్రజెండా' దేశవ్యాప్తంగా రెపరెపలాడింది. కార్మిక, కర్షక వర్గాల ఆశాదీపంగా, సామాజిక న్యాయానికి మారుపేరుగా కమ్యూనిస్టు పార్టీలు వెలుగొందాయి.

కుప్పకూలిన చివరి కోట - కేరళలో ఘోర పరాభవం..
అయితే, కాలక్రమేణా ఆ వైభవం మసకబారుతూ వచ్చింది. 2011లో బెంగాల్ చేజారింది, 2018లో త్రిపుర కోటను బీజేపీ బద్దలు కొట్టింది. ఇక మిగిలిన ఏకైక ఆశ కేరళ. పినరయి విజయన్ నేతృత్వంలో 2016 నుంచి సాగిన ఎల్డీఎఫ్ (LDF) పాలన వామపక్షాలకు చివరి ఆశ్రయంగా నిలిచింది. కానీ, 2026 ఫలితాలు ఆ ఆశలను కూడా అడియాశలు చేశాయి. తాజా ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ (UDF) దూసుకుపోతుండగా, ఎల్డీఎఫ్ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. ఐదు దశాబ్దాల తర్వాత కేరళ గడ్డపై కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి లేని పరిస్థితి ఏర్పడటం వామపక్షాల పతనానికి పరాకాష్ట.
బెంగాల్లో ఉనికి కోసమే పోరాటం..
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో నేడు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. 294 స్థానాలున్న అసెంబ్లీలో లెఫ్ట్ కూటమి కేవలం ఒక్క సీటులో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది. ఓటర్లు పూర్తిగా కుడి పక్షం (BJP) వైపు లేదా ప్రాంతీయ పార్టీ (TMC) వైపు మొగ్గు చూపుతుండటంతో, సిద్ధాంతాల పునాదులపై నిర్మించిన ఎర్రకోటలు మట్టిలో కలిసిపోతున్నాయి. 2004లో 59 లోక్సభ సీట్లున్న పార్టీ.. 2019 నాటికి 5 సీట్లకు పడిపోవడం వారి పతనానికి నిదర్శనం.
పతనానికి కారణాలు ఏంటి?
మార్పును ఆహ్వానించడంలో వైఫల్యం, యువ నాయకత్వం లేకపోవడం, మారుతున్న ప్రపంచీకరణ పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలను మార్చుకోలేకపోవడం వామపక్షాలను దెబ్బతీశాయి. యువతరం ఆకాంక్షలను పసిగట్టడంలో, డిజిటల్ యుగపు రాజకీయాలను అందిపుచ్చుకోవడంలో లెఫ్ట్ వెనుకబడింది. ఒకప్పుడు కార్మికులను ఏకం చేసిన శక్తి.. నేడు ప్రజల మద్దతును కూడగట్టలేక అప్రస్తుతంగా మారుతోంది. ఈ ఓటములతో భారత రాజకీయాల్లో వామపక్షాలు కేవలం చరిత్ర పుటలకే పరిమితమవుతాయా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.














Click it and Unblock the Notifications