కాంగ్రెస్ నిలబాడాలంటే - అదొక్కటే మార్గం : సోనియాతో ఆజాద్ భేటీ..!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాభవం కాంగ్రెస్ అధినాయకత్వంపైన వ్యతిరేక ప్రభావం చూపుతోంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు సోనియా గాంధీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు ఓడిన అయిదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను తమ పదవులకు రాజీనామా చేయాల్సిందిగా సోనియా ఆదేశించారు. ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక పైన నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఈ పరాజయం తరువాత వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న జీ23 నేతలు మరోసారి ఆజాద్ నివాసంలో సమావేశమ్యారు. ఆ సమయంలో పలు ప్రతిపాదనలు పార్టీ అధినాయకత్వానికి సూచించారు.
జీ 23 నేతల సమావేశంలో పలు అంశాలను ప్రతిపాదించారు. వీటి పైన నేరుగా చర్చించేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు గులామ్ నబీ ఆజాద్.. సోనియాతో గురువారం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాహుల్-ప్రియాంక గాంధీలు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో భాజపాను గద్దెదించాలంటే కాంగ్రెస్ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలతో అధిష్ఠానం చర్చలు జరిపి కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ బలోపేతానికి గల మార్గాలపై నేతలు చర్చించారు. పార్టీ బలోపేతం కావాలంటే కలిసొచ్చే పార్టీలతో కలిసి వెళ్లటం తో పాటుగా.. జాతీయ కూటమిని బలోపేతం చేయాలని సూచించారు.

Recommended Video

ప్రతీ స్థాయిలో సమిష్ఠి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. జీ 23 నేతల్లో కీలకంగా ఉండే కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీ కుటుంబం తప్పుకోవాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీని పైన సీనియర్లతో పాటుగా గాంధీ కుటుంబ మద్దతు దారులు సిబాల్ ను టార్గెట్ చేసారు. ఇప్పటికే జీ 23 సమావేశంలో చర్చించిన అంశాలు.. సూచనలను పార్టీ అధినేత్రికి ఆజాద్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ప్రత్యక్షంగా సమావేశం అవ్వటం ద్వారా భవిష్యత్ కార్యాచరణ పైన కీలక సూచనలు చేయనున్నట్లు చెబుతున్నారు. దీంతో..ఈ భేటీ పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications