గ్యాంగ్రేప్ కేసులో మాజీ సీఎస్ జితేంద్ర నరైన్ అరెస్ట్
పోర్ట్బ్లెయిర్: సామూహిక అత్యాచారం కేసులో అండమాన్ నికోబార్ దీవులు మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నరైన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ దరఖాస్తును స్థానిక కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
కోర్టు తీర్సు వచ్చిన కాసేపటికే జితేంద్ర నరైన్ను ఆయన ఉంటున్న ఓ ప్రైవేటు రిసార్టులోకి వెళ్లి భారీ భద్రత మధ్య అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నరైన్ సీఎస్గా ఉన్న సమయంలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి.. 21 ఏళ్ల యువతిపై తన అధికారిక నివాసంలో అత్యాచారానికి పాల్పడ్డారు. నరైన్ తోపాటు మరో అధికారి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఆగస్టులో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీనియర్ ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నరైన్ ను పలుమార్లు విచారించింది. అనంతరం సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీవ్రంగా స్పందించిన కేంద్ర హోంశాఖ.. ఢిల్లీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఛైర్మన్, ఎండీగా ఉన్న నరైన్ ను విధుల నుంచి తొలగించింది. తాజాగా, కోర్టు ఆదేశాల మేరకు నరైన్ పోలీసులు అరెస్ట్ చేశారని బాధితురాలి తరపు న్యాయవాది ఫాటిక్ చంద్రదాస్ తెలిపారు.