ఛోటా రాజన్: ప్రశ్నిస్తున్న సీబీఐ (ఫోటోలు)
న్యూఢిల్లీ/ముంబై: అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటా రాజన్ ను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. న్యూఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఛోటా రాజన్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్బంగా సీబీఐ కార్యాలయం చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
భారత్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7.45 గంటలకు ఇండోనేషియాలోని బాలి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీబీఐ, ముంబై, ఢిల్లీ పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఛోటా రాజన్ ను తీసుకుని భారత్ బయలుదేరారు.
శుక్రవారం వేకువ జామున 5 గంటల సమయంలో ఢిల్లీ లోని పాలం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పోలీసులతో పాటు స్వాట్ టీమ్స్ ను విమానాశ్రయంలో మోహరించారు.
సుమారు 100 కేసులు
భారత్లో ఛోటా రాజన్పై హత్యలు, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు తదితర 100 వరకు కేసులున్నాయి. వాటిలో దాదాపు 70 ముంబై నగరంలోనే నమోదైనాయి. ఢిల్లీలో 10 కేసులకు పైగా నమోదు అయ్యాయి.
25 ఏళ్ల తరువాత
ఉగ్రవాద నిరోధక చట్టం, టాడా, మోకా తదితర కఠిన చట్టాల కింద ఛోటా రాజన్ పై కేసులున్నాయి. పోలీసుల వేట తీవ్రం కావడంతో 1988లో ఛోటా రాజన్ దుబాయి పారిపోయాడు.
దావూద్ ప్రధాన అనుచరుడు
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు ప్రధాన అనుచరుడైన ఛోటా రాజన్ 1993 ముంబై పేలుళ్లను తీవ్రస్థాయిలో వ్యతిరేకించాడు. తరువాత ‘డీ' గ్యాంగ్కు దూరమయ్యాడు.
అనుచరుడే శత్రువు అయ్యాడు
ముంబైలో 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో అమాయకులు బలయ్యారని ఛోటా రాజన్ తన గురువు దావూద్ మీద తిరుగుబాటుకు దిగాడు. అనంతరం దావూద్ ఇబ్రహీంకు ప్రధాన శత్రువుగా మారాడు.
వెంటాడి చంపేశాడు
ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగిన తరువాత డీ గ్యాంగ్ లోని గ్యాంగ్ స్టర్స్ మీద ఛోటా రాజన్ కన్ను వేశాడు. డీ గ్యాంగ్ లోని వారు కనపడితే తన అనుచరులతో ఎక్కడపడితే అక్కడ అంతం చేయించాడు.
అదే అతని ధైర్యం
దావూద్ ఇబ్రహీం ప్లాన్ లు, అతని కదలికలు మొత్తం దగ్గర నుంచి చూసిన ఛోటా రాజన్ ఎక్కడా పప్పులో కాలు వెయ్యలేదు. డీ గ్యాంగ్ నుంచి తప్పించుకునేందుకు అతను అనేక ప్లాన్ లు వేశాడు.
అనారోగ్యం
ఛోటా రాజన్ అనారోగ్యంతో భాదపడుతున్నాడు. అతను కిడ్నీ వ్యాదితో డయాలసిస్ చేయించుకుంటున్నాడు.
అధికారుల అండ
దావూద్ ఇబ్రహీంను అంతం చెయ్యాలన్నా, అతని గురించి సమాచారం కావాలన్నా తనను వదిలి పెట్టాలని, తనకు సహకరించాలనే షరతులతో ఛోటా రాజన్ గతంలో భారత్ కు చెందిన కొందరు అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
చేతులు దులుపుకున్న మహారాష్ట్ర
ముంబైలో ఛోటా రాజన్ మీద నమోదు అయిన అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకునింది.