15 ఏళ్ల నిరీక్షణకు తెర: ఢిల్లీకి చేరుకున్న గీత
న్యూఢిల్లీ: 15 ఏళ్ల క్రితం తప్పిపోయి పాక్కు చేరిన భారత్కు చెందిన గీత కరాచీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. 10.40 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న గీతతో పాటు పాకిస్థాన్కు చెందిన ప్రతినిధులు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ను కలవనున్నారు.
స్వదేశానికి బయల్దేరిన గీత:
దాదాపు పన్నెండుఏళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్కు చేరిన భారత్కు చెందిన గీత తిరిగి స్వదేశానికి బయల్దేరింది. అక్కున చేర్చుకున్న అనురాగానికి వీడ్కోలు పలికారు. కాసేపట్లో గీత ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకోనుంది. కాగా, గీతను ఆహ్వానించేందుకు ఆమె తండ్రి జనార్ధన్ మహతో ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
గీత భారత్కు వస్తుండటంతో కన్న బిడ్డను చూసేందుకు తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు గీత బయలుదేరే సమయంలో ఈదీ ఫౌండేషన్లో భావోద్వేగాలు నిండిపోయాయి. పలువురు గీతను వదిలి వుండలేక కన్నీరు కార్చారు. ఆమెకు బహుమతులు ఇచ్చి పంపారు.
ఈరోజు ఉదయం 8.30 గంటలకు పాకిస్థాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి గీతతో పాటూ ఈదీ ఫౌండేషన్కు చెందిన ఫహాద్, ఫైజల్, బిల్క్విస్ ఈదీలు ఢిల్లీకి బయల్దేరారు. గీత తల్లిదండ్రులు బీహార్లోని సహ్రస్రా జిల్లాకు చెందిన వారు. సుమారు 15 ఏళ్ల క్రితం వైశాలిలో జరిగిన మేళాలో తమ కూతురు తప్పిపోయిందని వారు చెబుతున్నారు.
ఏడెనిమిదేళ్ల వయసులో సంఝౌతా ఎక్స్ప్రెస్లో కూచుని ఉన్న మూగ, బధిర బాలిక గీతను లాహోర్ రైల్వే స్టేషన్లో పాకిస్థానీ రేంజర్లు కనుగొని ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. కరాచీలోని 'ఈదీ ఫౌండేషన్' సారథి బిల్క్విస్ ఈదీ అప్పట్లో ఈ బాలికను చేరదీసి కన్నబిడ్డలా సాకారు. ఇప్పుడు గీత వయస్సు 23 ఏళ్ల వయసు. గీతను భారత్కు రప్పించేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
గీత తమ బిడ్డేనని పలు రాష్ట్రాల నుంచి ఎందరో బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ముందుకు రాగా, అధికారులు వారందరి ఫోటోలనూ సేకరించి పాక్కు పంపారు. భారత హై కమిషన్ పంపిన ఆరు ఫోటోల్లో తన తండ్రిని, సవతి తల్లిని, తోబుట్టువులను గుర్తించిన సంగతి తెలిసిందే.
దీంతో ఇప్పటికే గీత బీహార్లో తన కుటుంబం ఉంటున్నట్టుగా ఫొటోల ఆధారంగా గుర్తించిందని, డీఎన్ఏ పరీక్షల్లో పాజిటివ్గా వస్తే ఆ కుటుంబానికి గీతను అప్పగిస్తామన్నారు. ఒకవేళ పరీక్షలు నెగెటివ్గా వస్తే గీతకు ప్రత్యేకంగా ఆశ్రయం కల్పించి, తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకుంటామని భారత హైకమిషన్ హామీ ఇచ్చిందని తెలిపారు.
సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగీ భాయిజాన్' చిత్రం విడుదలైన తరువాత, దాదాపు అదే విధమైన కథను నిజ జీవితంలో కలిగిన గీత ఉదంతం తెరపైకి రాగా, ఆమెను ఎలాగైనా తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని భారత విదేశాంగ శాఖ, మీడియా తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే.